పాక్ మరో దుశ్చర్య-శ్రీనగర్-షార్జా విమానాలకు తమ గగనతలం నిరాకరణ-కశ్మీర్ పార్టీల ఫైర్
అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ భారత్ ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్ ఇవాళ మరో దుశ్చర్యకు పాల్పడింది. దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత పునరుద్ధరించిన శ్రీనగర్-షార్జా విమాన సర్వీసులను తమ భూభాగంపై నుంచి అనుమతించబోమని పాకిస్తాన్ తేల్చిచెప్పింది. దీంతో ఈ విమానాలు ఢిల్లీ మీదుగా చుట్టు తిరిగి వెళ్లాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.
శ్రీనగర్ నుంచి షార్జాకు విమానాల కోసం పాకిస్తాన్ తన గగనతలాన్ని ఉపయోగించడాన్ని నిరాకరించింది, 11 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించిన ఈ సర్వీసులు తమ గగన తలంపై నుంచి వెళ్లకుండా పాకిస్తాన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రభావం జమ్మూ కాశ్మీర్ ప్రజలపైనే ఎక్కువగా పడబోతోంది. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉదయపూర్, అహ్మదాబాద్, ఒమన్ మీదుగా విమానాలు ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో పాటు శ్రీనగర్ నుంచి షార్జాకు వెళ్లే విమానానికి గంటపాటు ప్రయాణసమయం కూడా పెరుగుతుంది. అలాగే విమాన ఛార్జీ కూడా పెరగబోతోంది.

అక్టోబర్ 23న, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్లోని షేక్ ఉల్-ఆలం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శ్రీనగర్-షార్జా విమానాన్ని ప్రారంభించారు. 11 సంవత్సరాల తర్వాత కశ్మీర్, యుఎఇ మధ్య నేరుగా విమాన సర్వీసుల్ని పునరుద్ధరించారు. పాకిస్తాన్ తాజా నిర్ణయంపై కశ్మీర్లోని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఇది చాలా దురదృష్టకరమైన చర్య అని కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. 2009-2010లో శ్రీనగర్ నుంచి దుబాయ్కి ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం విషయంలోూ పాకిస్తాన్ ఇలాగే వ్యవహరించిందని ఆయన గుర్తు చేశారు. పాక్ గగనతలంపై ప్రయాణించడానికి గో ఫస్ట్ ఎయిర్ వేస్ కు పాకిస్తాన్ అనుమతి ఇస్తుందని తాను ఆశించినట్లు అబ్దుల్లా తెలిపారు. కశ్మీర్ మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా పాకిస్తాన్ చర్యలను తప్పుబట్టారు. కేంద్రం జోక్యం చేసుకుని పాకిస్తాన్ గగనతలాన్ని తెరిపించాలని కోరారు.












Click it and Unblock the Notifications