ఒకేరోజు 39 మంది ఉగ్రవాదులు హతం! ఆత్మాహుతి దాడికి ప్రతీకారమా?
ఓ ఉగ్రవాది ప్రార్థనా మందిరంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 76 మందిని బలితీసుకున్న తెల్లారే.. పాకిస్తాన్ భద్రతా దళాలు దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించి మొత్తం 39 మంది ఉగ్రవాదులను కాల్చి చంపాయి.
ఇస్లామాబాద్: సింధు ప్రావిన్స్ లోని సెహవాన్ లో ఉన్న సూఫీ ప్రార్థనామందిరం లాల్ షహబాజ్ కలందర్ లోకి ఉగ్రవాది చొరబడి.. ఆత్మాహుతి దాడికి పాల్పడి 76 మందిని బలితీసుకున్న తెల్లారే.. పాకిస్తాన్ భద్రతా దళాలు దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించి మొత్తం 39 మంది ఉగ్రవాదులను కాల్చి చంపాయి.
ఒక్క దక్షిణ ప్రావిన్సులోనే 18 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పారామిలటరీ సింధ్ రేంజర్స్ శుక్రవారం వెల్లడించింది. సింధ్ లోని సూపర్ హైవే వద్ద సైనిక కాన్వాయ్ పైన కాల్పులకు తెగబడిన మరో ఏడుగురు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు రేంజర్స్ పేర్కొంది.

కరాచీలో మంఘోపిర్ వద్ద జరిపిన సోదాల్లో 11 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు తెలిపింది. మరోవైపు ఖైబర్-ఫక్తున్ఖవాలో పోలీసులు ప్రత్యేకంగా జరిపిన ఆపరేషన్ లో మరో 11 మంది తీవ్రవాదులు హతమైనట్లు ఓ సీనియర్ భద్రతాధికారి వెల్లడించారు.
తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పనిచేస్తోందనీ.. మున్ముందు మరింత విస్తృతంగా దాడులు జరుపుతామని ప్రకటించారు. కేవలం వారం రోజుల్లోపు ఎనిమిది సార్లకుపైగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడడంతో పాకిస్తాన్ ప్రభుత్వం సోదాలు జరపమని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications