భారత్ మీద పాక్ ప్రతీకారం: సార్క్ కు పోటీగా గ్రేటర్ అలయెన్స్
ఇస్లామాబాద్: దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) సమావేశాలను బహిష్కరించి పాకిస్థాన్ ను దౌత్యపరంగా చావు దెబ్బ కొట్టిన భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పాక్ ప్రణాళికలు రచిస్తొంది.
సార్క్ కు పోటీగా విశాల దక్షిణ ఆసియా ఆర్థిక కూటమి ( గ్రేటర్ సౌత్ ఏషియన్ ఎకనామిక్ అలయెన్స్) ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ దిశగా దాయాది దేశం పాకిస్థాన్ భారీ ప్రణాళికలు రచిస్తోంది.
సార్క్ ఏర్పడిన నాటి నుంచి కూటమిలో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోందని ఇంత కాలం పాక్ ఆరోపించింది. అందుకే సార్క్ కు పోటీగా ఇప్పుడు గ్రేటర్ అలయెన్స్ ను తెరమీదకు తీసుకు వచ్చింది.
గ్రేటర్ అలయెన్స్ లో భారత్ కూడా చేరవచ్చని పాక్ అంటుంది. బుధవారం పాకిస్థాన్ కు చెందిన డాన్ పత్రిక ఈ విషయంపై కథనం ప్రచురించింది. గ్రేటర్ అలయెన్స్ లో చైనా, ఇరాన్ తో పాటు మరన్ని దేశాలు భాగస్వాములను చేయాలని పాక్ భావించింది.
ఈ విషయంపై న్యూయార్క్ లో పర్యటిస్తున్న పార్లమెంటరీ బృందం కొత్త కూటమి విధివిధానాలపై చర్చిస్తుందని డాన్ పత్రిక ఓ కథనం ప్రకటించింది. గ్రేటర్ అలయెన్స్ అసలు ఉద్దేశం భారత్ ను ఇబ్బంది పెట్టడమే.
పాకిస్థాన్ పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన ముషాహిద్ హుస్సేన్ సయీద్ మంగళవారం న్యూయార్క్ లో మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ అలయెన్స్ ఏర్పాటు చేస్తున్నామని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
అయితే ఈ కూటమి ఇప్పటికే మనుగడలో ఉన్నప్పటికి ఆయా దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక పరమైన సహకార ఒప్పందాలు ఏమీ లేవు. గ్రేటర్ సౌత్ ఏషియన్ ఎకనామిక్ అలయెన్స్ ఏర్పాటుతో అన్ని సభ్యదేశాలు అభివృద్దిలో భాగస్వాములు కావచ్చు.
భారతదేశాన్ని ఈ కూటమిలోకి ఆహ్వానిస్తామని, కానీ వాళ్లు చేరకపోవచ్చు అని ముషాహిద్ హుస్సేన్ చెప్పారు. సార్క్ లో భారత్ ఆధిత్యం కొనసాగుతుందని, అందు వలన కొత్తగా ఏర్పాటు అయ్యే గ్రేటర్ అలయెన్స్ లో చేరకపోవచ్చని ముషాహిద్ హుస్సేన్ అన్నారు.
నవంబర్ లో ఇస్లామాబాద్ వేదికగా జరగవలసిన సార్క్ సమావేశాలను భారత్ బహిష్కరించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని భారత్ బహిరంగంగానే చెప్పింది.
భారత్ కు అండగా శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్ నిలిచాయి. ఆదేశాలు సైతం సార్క్ సమావేశాలను బహష్కరించాయి. పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిప్తున్నందుకే తాము సార్క్ సమావేశాలను బహిష్కరించామని ఆదేశాల నేతలు చెప్పారు.
ఈ దెబ్బతో దక్షిణ ఆసియాలో పాక్ ఒంటరి అయిపోయింది. త్వరలో అందరితో కలవడానికి పాక్ ఇప్పుడు గ్రేటర్ అలయెన్స్ ను తెరమీదకు తీసుకువస్తుంది. అయితే సార్క్ లో ఉన్న దేశాలు గ్రేటర్ అలయెన్స్ లో చేరే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సార్క్ కూటమికి ఈ కొత్త కూటిమి వలన ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు. అఫ్ఘనిస్థాన్ మధ్య ఆసియాలో ఉంది. ఒక వేళ ఆర్థిక ప్రయోజనాల కోసం అది చేరే అవకాశం ఉంది. అయితే గ్రేటర్ అలయెన్స్ కూటమిలో ఉన్నా భారత్ చెప్పినట్లు అఫ్ఘనిస్థాన్ నడుచుకుంటుందని పాక్ మీడియా వెల్లడించింది.