బుర్హన్వాని-యూరి: భారత సైన్యంపై షరీఫ్ అక్కసు, ఉగ్రవాదంపై అసలు రంగు!
న్యూఢిల్లీ: ఉగ్రవాదం పైన పాకిస్తాన్ మరోసారి తన రంగు బయటపెట్టుకుంది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. యూరి ఉగ్రదాడిని ప్రస్తావించలేదు. అదే సమయంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాడు. జమ్ము కాశ్మీర్ వేర్పాటువేది బుర్హన్ వానిని యువనాయకుడిగా కీర్తించాడు.
కాశ్మీర్ సమస్య పరిష్కారం కానిదే భారత, పాకిస్తాన్ నడుమ శాంతి సాధ్యం కాదని షరీఫ్ స్పష్టం చేశాడు. రెండు రోజులుగా వివిధ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించి విఫలమైన షరీఫ్ బుధవారం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య భేటీలో ప్రసంగించే అవకాశాన్ని వినియోగించుకున్నాడు.
తన ఇరవై నిమిషాల ప్రసంగంలో అధిక శాతం కాశ్మీర్ అంశానికే కేటాయించాడు. కాశ్మీర్లో భారత సైన్యం అరాచకాలకు పాల్పడుతోందన్నాడు. భారత దళాలు కశ్మీరీ యువనేత బుర్హాన్ వానీని దారుణంగా హతమార్చాయన్నాడు.
కాశ్మీరీల పోరాటం న్యాయ సమ్మతమైనదని, వారికి మద్దతిస్తామన్నాడు. కాశ్మీర్లో వాస్తవ పరిస్థితుల పైన ఐరాస నిజ నిర్ధారణ కమిటీని పంపాలని సూచించాడు. అలాగే ఐరాస నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్నాడు. కాశ్మీర్లో భారత సైన్యం అకృత్యాలపై తగిన ఆధారాలు అందచేస్తామన్నాడు.
పాక్ ఉగ్రబాధితురాలు
విదేశీ శక్తుల ప్రోత్సాహంతో తమ దేశంలో ఉగ్రవాదులు చెలరేగిపోతుండటంతో పాకిస్థాన్ ఉగ్ర బాధిత దేశంగా మారిందన్నాడు. భారతతో శాంతినే కోరుకుంటున్నామని, చర్చలకు చొరవ చూపుతున్నా, అంగీకార యోగ్యంకాని నిబంధనలతో భారత్ ప్రతికూలా వాతావరణం సృష్టిస్తోందన్నాడు.
ఆయుధాలు సమకూర్చుకోవడంలో భారతతో పోటీపడాలని తాము భావించడం లేదని చెప్పాడు. అణు పరీక్షల నిషేధ ఒప్పందంపై భారతతో చర్చలకు తాము సిద్ధమన్నాడు. ఐరాసలో ప్రసంగానికి ముందు షరీఫ్ తమ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్తో మంతనాలు జరిపాడు.
ఐరాసలో బుర్హాన్ వనీని ప్రశంసించడం ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదులతో తన అనుబంధాన్ని మరోసారి చాటుకొందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అంతకుముందు..
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పనిగట్టుకుని కాశ్మీర్ అంశాన్ని తాను కలుసుకున్న ప్రపంచనాయకులందరి ముందూ ప్రస్తావించారు. ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఆయన కాశ్మీరు అంశాన్ని అమెరికా, బ్రిటన్, జపాన్, టర్కీ దేశాల నాయకుల వద్ద లేవనెత్తినప్పటికీ, ఆయనకు పెద్దగా ఫలితం కనిపించలేదు.
కాశ్మీరు సమస్య పరిష్కారం కోసం జోక్యానికై ఆయన చేసిన విన్నపాలకు స్పందన పెద్దగా రాలేదు. అన్నికంటే ప్రధానంగా ఐరాస సారథి బాన్కీ మూన్ కూడా అసలు కాశ్మీరు అంశాన్ని ప్రస్తావించక పోవడం గమనార్హం. ఐరాస సర్వప్రతినిధిసభలో చేసిన ముగింపు ప్రసంగంలో ఎక్కడా కూడా కాశ్మీరు ఊసే ఎత్తలేదు. అనంతరం షరీఫ్ తన ప్రసంగంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాడు.