పట్టుబడ్డ ఉగ్రవాది నవీద్ పాకిస్థానీ కాదు: పాక్
ఇస్లామాబాద్: భారతదేశంలోని జమ్మూకాశ్మీర్లో పట్టుబడిన ఉగ్రవాది నవీద్ తమ దేశస్థుడు కాదని పాకిస్థాన్ ప్రకటించింది. ఉధంపూర్ ఘటనలో సజీవంగా చిక్కిన మహ్మద్ నవీద్ యాకుబ్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ పాకిస్థాన్లోని ఫైసలాబాద్కు చెందినట్టు అతనే స్వయంగా ఒప్పుకున్నాడని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం లోక్సభలో ప్రకటించిన కొద్దిసేపటికే పాకిస్థాన్ స్పందించింది.
అసలు నవీద్ తమ దేశస్థుడే కాదని బుకాయించింది. భారత్ తమపై అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉధంపూర్ వద్ద బుధవారం బీఎస్ఎఫ్ కాన్వాయ్పై జరిపిన ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు మరణించగా, పలువురికి గాయాలైన సంగతి తెలిసింది.
ఎదురు కాల్పుల్లో మహ్మద్ నోమెన్ అనే ఉగ్రవాది మృతి చెందగా మరో ఉగ్రవాది ఉస్మాన్ సజీవంగా పట్టుబడ్డాడు. ప్రస్తుతం అతడిని ఎన్ఐఏ విచారిస్తోంది. బుధవారం పోలీసులకు పట్టుబడిన అనంతరం.. తనది పాకిస్థాన్లోని ఫైసలాబాద్ అని, మహ్మద్ నోమిన్తో కలిసి భారత్లో ఉగ్రదాడి జరిపేందుకు వచ్చానని ఉస్మాన్ స్వయంగా ఒప్పుకున్నాడు.
తనకు 20 సంవత్సరాలని ఓసారి.. కాదు 16ఏళ్లని మరోసారి చెప్పాడు. అయితే పాక్ మాత్రం తన వక్రబుద్ధిని మరోసారి బయటపెడుతూ భారత్కు చిక్కిన నవీద్ అసలు పాకిస్థాన్ దేశస్తుడే కాదని ప్రకటించింది.