పాకిస్తాన్ కీలక నిర్ణయం-కాబూల్ కు విమానాల పునఃప్రారంభం-విదేశీయల తరలింపుకూ రెడీ
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల దురాక్రమణ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సమస్యాత్మకంగా మారిన కాబూల్ నుంచి తమ పౌరుల్ని వెనక్కి తెప్పించే విషయంలో ఇతర దేశాలన్నీ చర్యలు తీసుకుంటున్నా పాకిస్తాన్ మాత్రం మందుకు రాలేదు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆఫ్ఘన్ పౌరులు తమ దేశంలోకి భారీగా వలస వచ్చే ప్రమాదం ఉందని భావించి కాబూల్ కు విమానాల్ని రద్దు చేసిన పాకిస్తాన్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది.
పాకిస్తాన్ నుంచి కాబూల్ కు విమాన సర్వీసులు పునరుద్ధరించాలని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు కాబూల్ కు రోజుకు రెండు విమానాలు నడిపేందుకు పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ కు అనుమతి ఇచ్చింది. ఈ రెండు విమానాల్లో పాకిస్తాన్ పౌరుల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ కు చెందిన దాదాపు 400 మంది పౌరులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పాక్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది.
పాకిస్తాన్ నుంచి కాబూల్ వెళ్లే విమానాల్లో అక్కడ చిక్కుకున్న విదేశీయుల్ని, జర్నలిస్టుల్ని కూడా తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ విదేశాంగశాఖ ప్రకటించింది. వీరిని విమానాలోత పాటు భూభాగం ద్వారా కూడా తమ దేశంలోకి అనుమతిస్తామని వెల్లడించింది. ఇందుకోసం వారికి ప్రత్యేక వీసాలు కూడా జారీ చేయాలని నిర్ణయించిట్లు అధకారులు తెలిపారు. ఇప్పటికే భారత్ కూడా ఆప్ఘన్ లో చిక్కుకున్న వారికి ప్రత్యేక ఎలక్ట్రానిక్ వీసాలు జారీ చేసి మరీ కాబూల్ నుంచి వెనక్కి రప్పిస్తోంది. ఇదే కోవలో పాకిస్తాన్ కూడా ప్రత్యేక వీసాల జారీతో తమ జాతీయులతో పాటు విదేశీయులు, జర్నలిస్టుల్ని కూడా పాకిస్తాన్ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాలిబన్లతో ఉన్న సంబంధాల్ని వాడుకుంటూ వీరి తరలింపుకు ఇమ్రాన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.