పాకిస్తాన్తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదు: తేల్చిచెప్పిన సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ/కరాచీ: పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లోను ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడే ప్రసక్తి లేదని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం తేల్చి చెప్పారు. విదేశాంగ శాఖకు చెందిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. తటస్థ వేదికలపై ఇరు జట్ల మధ్య మ్యాచ్లు జరగవని చెప్పారు.
సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇటీవల పదేపదే కాల్పులకు తెగబడుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ దౌత్యం సరైనది కాదని ఆమె చెప్పారు. కానీ ఇరు దేశాల మధ్య ఖైదీల అప్పగింత జరుగుతుందని చెప్పారు.
ఉగ్రవాదం, క్రికెట్ ఒకేదారిలో కలిసి నడవలేవని సుష్మా చెప్పారు. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదం, కాల్పుల విరమణకు తూట్లు పొడవడం ఆపేంత వరకు తటస్థ వేదికల్లోనూ సిరీస్లు జరిగే ప్రసక్తే లేదన్నారు.
భారత్లోని పాకిస్థాన్ రాయబారిని తాను కలిసినట్టు సుష్మ తెలిపారు. మానవతా దృక్పథం, సహృద్భావంతో 70 ఏళ్ల వయసు దాటిన ఖైదీలు, మహిళలు, మతి స్తిమితం సరిగా లేని వారిని రెండు దేశాలు విడుదల చేసుకోవాలని ఆమె ప్రతిపాదించారు.
ఈ మధ్యే జరిగిన మాల్దీవులు-చైనా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఆ రెండు దేశాల మధ్య పెరుగుతున్న అనుబంధం, భారత్పై వాటి ప్రభావం గురించి సభ్యులు సుష్మా స్వరాజ్ను అడిగి తెలుసుకున్నారు. భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు సన్నిహితంగా, సుహృద్భావంతో ఉన్నాయన్నారు.
ఇటీవల కులభూషణ్ జాదవ్ కుటుంబంతో పాక్ కనబరిచిన వ్యవహారంతో పాటు కాల్పుల విరమణకు పాల్పడిన పాకిస్తాన్తో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలతో సంబంధాలు అజెండాతో ఈ సమావేశం జరిగింది.