అయోధ్యలో పాక్ సైన్యం..! ఎర్రకోట గోడలు రక్తసిక్తం..! పాక్ ఎంపీ దారుణ వ్యాఖ్యలు..!
భారత్,పాకిస్తాన్ మధ్య పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఏ క్షణమైనా పాకిస్తాన్ పై భారత్ దాడి చేయొచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఎంపీ పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ భారత్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మహిళా ఎంపీ పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ పార్లమెంట్ లో చేసిన ప్రసంగంలో..."అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదుకు మొదటి ఇటుకను పాకిస్తాన్ ఆర్మీ సైనికులు వేస్తారని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే మొదటి అజాన్ (నమాజ్ కోసం ఇచ్చే పిలుపు) ను ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ స్వయంగా ఇస్తారని తెలిపారు. తద్వారా భారత్ లో ముస్లిం ప్రభుత్వం వస్తుందనే అర్దంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ శత్రుత్వం పాకిస్తాన్ లేదా పాకిస్తానీయులతో కాదు, ఇది ముస్లింలకు మరియు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న శత్రుత్వం అని ఎంపీ జై ఖాన్ వ్యాఖ్యానించారు. ఏదైనా చేయి మన వైపుకు వస్తే, వారి శక్తికి చిహ్నంగా ఉన్న ఢిల్లీ ఎర్రకోట, దాని గోడలు ఎన్నడూ చూడని రక్తపాతాన్ని చూస్తుందన్నారు. దాని ప్రాకారాలు వచ్చే కొన్ని శతాబ్దాలుగా దానికి సాక్ష్యంగా ఉంటాయన్నారు. పాకిస్తానీలు బలహీనులు కాదని, తాము గాజులు తొడుక్కోలేదని ఆమె తెలిపారు.

దివంగత వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ను ప్రస్తావిస్తూ..మాకు తుపాకులు ఉన్నాయి, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర చెట్లు ఉన్నాయి, మరియు శత్రువు ఏదైనా దుస్సాహసం చేస్తే వారి శవాలను మా చెట్లకు వేలాడదీస్తాం అంటూ వ్యాఖ్యానించారు. అయితే చివరిగా తనకు భారత పౌరులతో ఎలాంటి వైరం లేదని తెలిపారు. సిక్కు సైన్యం పాకిస్తాన్ పై దాడి చేయదని, ఎందుకంటే అది వారికి గురునానక్ భూమి అని చెప్పుకొచ్చారు. అలాగే ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నుపై ప్రశంసలు కురిపించారు.
మన సైన్యం కేవలం ఆరు లేదా ఏడు లక్షల మంది సైనికులు కాదని, 250 మిలియన్ల మంది ఉన్నారని ఖాన్ గుర్తుచేశారు. సమయం వచ్చినప్పుడు, వారు మన సాయుధ దళాలతో భుజం భుజం కలిపి నిలబడి, దేవుడు కోరుకుంటే సైనికులుగా మారతారని తెలిపారు. ఈ ప్రసంగం వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్గా మారింది.












Click it and Unblock the Notifications