పాకిస్తాన్కు కరోనా కాటు.. 8వేల మందికి టెస్టులు.. ఇరాన్లో మృత్యుహేల.. బయో వెపన్..
తూర్పు ఆసియాలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న కొవిడ్ 19(కరోనా వైరస్) ఇప్పుడు మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాలకూ విస్తరించింది. ఆయా రాష్ట్రాల సహకారంతో భారత ప్రభుత్వం పకడ్బందీ చర్యలతో ప్రమాదం నుంచి గట్టెక్కగా.. దాయాది పాకిస్తాన్ తాజాగా కరోనా కాటుకు గురైంది. గురువారం నుంచి ఆ దేశంలోని స్కూళ్లు మూతపడ్డాయి. ఇద్దరికి వైరస్ సోకినట్లు నిర్ధారించిన అధికారులు.. దేశవ్యాప్తంగా 8 వేల మంది అనుమానితులకు టెస్టులు చేయనున్నట్లు ప్రకటించారు. పాక్ పొరుగుదేశం ఇరాన్ లో కరోనా మరణాల సంఖ్య 26కు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య 3వేలకు చేరువైంది.
Recommended Video


ఎలా వ్యాపించిందంటే..
పొరుగుదేశం ఇరాన్ లో కరోనా విజృంభిస్తుండటంతో ఆ ప్రభావం పాకిస్తాన్ పై పడింది. ఇరాన్లోని షియా ప్రార్థనా స్థలాలను దర్శించుకుని తిరిగొచ్చిన యాత్రికుల ద్వారా దేశంలోకి వైరస్ వ్యాపించినట్లు పాక్ అధికారులు తెలిపారు. మూడ్రోజుల కిందట ఇరాన్ నుంచి తిరిగొచ్చిన ఓ కరాచీ వాసికి కరొనా సోకినట్లు గుర్తించారు. ఆ వెంటనే సింధ్ ఫ్రావిన్స్ లోని మరో వ్యక్తికీ వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నెలలో ఇరాన్ వెళ్లొచ్చిన 8వేల మందికీ కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించింది.

స్కూళ్ల మూసివేత.. విమానాలు రద్దు..
ఇరాన్ నుంచి తిరిగొచ్చిన ఆ 8 వేల మందిని చిరునామాల ఆధారంగా గుర్తించి, టెస్టులు చేయబోతున్నట్లు అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరాన్ సరిహద్దును ఆనుకుని ఉండే ప్రాంతాల్లోని అన్ని స్కూళ్లను గురువారం నుంచి మూసేశారు. మరోవైపు, ఇరాన్ కు వెళ్లే అన్ని విమానాలనూ గురువారం సాయంత్రం నుంచి రద్దు చేయబోతున్నట్లు పాక్ విమానయాన శాఖ ప్రకటించింది. అటు నుంచి వచ్చే విమానాలను కూడా అనుమతించబోమని తెలిపింది. పాకిస్తాన్ కు చైనా, ఇరాన్ తో సరిహద్దులున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇరాన్ లో మృత్యుహేల..
అసలే అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతోన్న ఇరాన్ లో కరోనా కలకలం రేపుతున్నది. గురువారం సాయంత్రం నాటికి ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 26కు పెరిగింది. దేశరాజధాని టెహ్రాన్, దాన్ని ఆనుకుని ఉండే కోమ్ నగరాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

బయోవెపన్ ప్రాపగండా..
చైనా తయారు చేసిన జీవాయుధం(బయో వెపన్) నుంచే కరోనా వైరస్ పుట్టుకొచ్చిందనే ఆరోపణల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ‘‘జీవాయుధాలు తయారు చేస్తున్నామంటూ ఇరాన్ పై తప్పుడు ప్రచారం చేసి, ఆంక్షలు విధించారు. ఆ ప్రాపగండావెనకున్న నిజాలేంటో ప్రపంచానికి ఇవాళ తెలుస్తోంది. కరోనా వైరస్ ను అడ్డుకోడానికి మా దగ్గర సరంజామా లేదు. అయినాసరే ప్రజల్ని నిర్బంధించాలని భావించడంలేదు''అని రౌహానీ మీడియాతో అన్నారు.

చైనాలో అదే టెన్షన్..
కోవిడ్ 19(కరోనా వైరస్) జన్మస్థలమైన చైనాలో నెలన్నరగా అదే టెన్షన్ కొనసాగుతున్నది. వైరస్ బారినపడి చనిపోయినవారి సంఖ్య చైనాలో 2,670కాగా, మరో 80 వేల మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. చైనా నుంచి ఇరాన్ మీదుగా మిడిల్ఈస్ట్ దేశాలకు వ్యాపించిన వైరస్.. బుధవారం నాటికి పాకిస్తాన్ ను కూడా కాటేసింది.












Click it and Unblock the Notifications