భారత్ దెబ్బకు రష్యా సాయం కోరిన పాకిస్తాన్ ? ఆలోపే క్రెడిట్ కోసం ట్రంప్ ఎంట్రీ ?
కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ధాటికి పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైంది. తొలుత ఉగ్రశిబిరాలతో మొదలైన ఆపరేషన్ సింధూర్ క్రమంగా పాకిస్తాన్ లోని ఎయిర్ బేస్ లు, రక్షణ స్థావరాలు, ఆయుధ రక్షణ వ్యవస్థలకూ విస్తరించింది. దీంతో పాకిస్తాన్ అమెరికా సాయం కోరిందని, దీంతో అమెరికా సూచన మేరకు భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇప్పటివరకూ ప్రచారం జరుగుతోంది. అయితే పాకిస్తాన్ వినతి మేరకే సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నట్లు భారత్ చెబుతోంది. కానీ పాకిస్తాన్ అమెరికాతో పాటు రష్యా సాయం కూడా కోరినట్లు వెల్లడైంది.
రష్యా వార్తా సంస్థ టాస్ (TASS) తాజాగా బయటపెట్టిన వివరాల ప్రకారం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ దేశంతో ఘర్షణల్ని ఆపేందుకు, సమస్య పరిష్కారం కోసం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సాయం కోరారు. పాక్ ప్రధాని సహాయకుడు సయ్యద్ తారిఖ్ ఫతేమీ ఓ లేఖ ద్వారా రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ కు ఈ సాయం విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపింది.

భారత్ తో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో చేపట్టే ఏ దౌత్యపరమైన ప్రయత్నానికైనా ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని సయ్యద్ తారిక్ ఫతేమి ఈ లేఖలో తెలిపారు. ఏ నిమిషంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే పరిస్థితిలో పొరుగువారు జీవించలేరని ఆయన అన్నారు. ఏదైనా తటస్థ మధ్యవర్తిత్వంతో జరిగే చర్చల్లో పాల్గొనడానికి పాకిస్తాన్ సిద్ధంగానే ఉన్నట్లు ఆయన సమాచారం పంపారు. అయితే ఫతేమీ పంపిన లేఖకు సమాధానంగా రష్యా తన భారత్ పై తన ప్రభావం ఉపయోగించడానికి బదులుగా భారత్ తో పాకిస్తాన్ చర్చలు జరపడమే మేలని సూచించారు.

భారత్-పాక్ చర్చలకు ఐరాస లేదా ఏదైనా తటస్థ దేశం నుంచి వచ్చే ప్రతిపాదనలకు తాము సిద్ధంగానే ఉన్నట్లు చెప్పేందుకు అమెరికా, ఐరోపా దేశాలతో పాటు రష్యాకు కూడా అధికారుల్ని పంపినట్లు కూడా పాకిస్తాన్ ప్రధాని దూత తెలిపారు. అలాగే భారత్ తో ఘర్షణల నివారణ కోసం రష్యా నుంచి వచ్చే ప్రతిపాదనల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం మీద భారత్-పాక్ చర్చలు జరిగేలా చూడాలని ఆయన కోరారు. కానీ రష్యా భారత్-పాక్ నేరుగా చర్చలు జరిపితేనే మంచిదని సూచించింది. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications