2019 ఎన్నికల తర్వాత భారత్తో చర్చలు జరుపుతాం: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
రియాద్ : భారత్లో 2019 ఎన్నికల తర్వాత సంబంధాలపై చర్చలు ప్రారంభిస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత్తో శాంతి చర్చలు జరిపేందుకు తాను ప్రయత్నించినట్లు చెప్పిన ఇమ్రాన్... భారత్ నుంచి సానుకూల స్పందన రాలేదని వెల్లడించారు. అయితే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేందుకు తాను కృషి చేస్తానని వెల్లడించారు. పాకిస్తాన్కు ప్రస్తుతం శాంతి, మరియు దేశానికి భద్రత కావాలని ఆయన చెప్పారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో పెట్టుబడుల సమాఖ్య సమావేశంలో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గత నెల సెప్టెంబర్లో భారత్ - పాక్ దేశాల మధ్య జరగాల్సిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశాన్ని భారత్ రద్దు చేసుకుంది. ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత్కు చెందిన భద్రతా సిబ్బందిని తీసుకెళ్లి హత్యచేసినందుకు నిరసనగా భారత్ ఆ సమావేశాన్ని బహిష్కరించింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదని ఆదేశాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు సౌదీ అరేబియా తనవంతు సహకారం అందించాలని కోరారు ఇమ్రాన్ ఖాన్ . ఇందుకోసం ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ నుంచి రుణం పొందడంతో పాటు తమకు సహకరించే దేశ ప్రభుత్వాల నుంచి రుణం తెచ్చుకోవాల్సి ఉందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇదిలా ఉంటే ఐఎమ్ఎఫ్ పాకిస్తాన్కు రుణం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తమ దేశానికి రెండు ఆయిల్ రిఫైనరీలు కూడా కావాల్సి ఉందని చెప్పిన ఇమ్రాన్ ఖాన్...ఇందుకోసం సౌదీ అరేబియాతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే సౌదీ అరేబియాకు రాజు మొహ్మద్ బిన్ సల్మాన్ సౌదీలోని పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారని వారందరినీ పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.