బస్సు డ్రైవర్ కొడుకైతేనేం..! ఇప్పుడతను లండన్ మేయర్
ఎనిమిదేళ్ల విరామం తర్వాత బ్రిటన్ రాజధాని లండన్ పై మళ్లీ తమ జెండా ఎగురవేసింది లేబర్ పార్టీ. ఓ బస్సు డ్రైవర్ కొడుకు ఈ దఫా ఎన్నికల్లో లండన్ మేయర్ గా ఎన్నికవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాకిస్తాన్ కు చెందిన బస్సు డ్రైవర్ కొడుకు సాధిఖ్ ఖాన్ (45) లేబర్ పార్టీ తరుపున లండన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటారు.
ప్రతిపక్ష లేబర్ పార్టీ తరుపున సాధిఖ్ ఖాన్, అధికార కన్జర్వేటివ్ పార్టీ తరుపున జాక్ గోల్డ్ స్మిత్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో తలపడగా.. గోల్డ్ స్మిత్ పై 9 శాతం ఓట్లతో విజయం సాధించారు సాధిఖ్ ఖాన్. సూపర్ థర్స్ డే పేరిట అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలో విజయం సాధించడం ద్వారా లండన్ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి ముస్లింగా గుర్తింపు తెచ్చుకున్నారు సాధిఖ్.

మొత్తం ఓట్లలో 46 శాతం ఓట్లు సాధిఖ్ కు దక్కాయి. కాగా..! ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రావాలంటే 50 శాతం ఓట్లు పోల్ అవ్వాలన్న నిబంధన ఉన్నందున రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించారు అధికారులు. రెండో ప్రాధాన్యత ఓట్లలోను సాధిఖ్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు స్మిత్. సాధిక్ విజయంతో ఎనిమిదేళ్లుగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటూ వస్తున్న కన్జర్వేటివ్ పార్టీ పరంపరకు బ్రేక్ పడ్డట్టయింది.
ఇక మేయర్ గా ఎన్నికైన సాధిఖ్ వ్యక్తిగత వివరాలను పరిశీలిస్తే.. పాకిస్తాన్ కు చెందిన ఆయన 2005లో టూటింగ్ ఎంపీగా విజయం సాధించారు. లండన్ మాజీ ప్రధాని గార్డన్ బ్రౌన్ కేబినెట్ లో సాధిఖ్ కీలక శాఖలో పనిచేశారు. ఇదిలా ఉంటే..! సాధిఖ్ ను నిలువరించడానికి స్మిత్ వేసిన ఎత్తుగడలేవి ఓటర్లను ఆకర్షించలేదు. తీవ్రవాదులతో సాధిఖ్ కు సంబంధాలు ఉన్నాయంటూ స్మిత్ చేసిన దుష్ప్రచారాన్ని అక్కడి ప్రజలు విశ్వసించలేదు. స్మిత్ దుష్ప్రచారానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చిన సాధిఖ్, దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే జాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎన్నికల ప్రచారం సాగించారు.












Click it and Unblock the Notifications