భారత్ కు మరోసారి పాకిస్థాన్ వార్నింగ్..
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ నదీ జలాల పంపిణీ నిలిపివేత ఒకటి. అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తాజాగా పాకిస్థాన్ డిమాండ్ చేసింది. సింధూ జలాలపై భారత్ ఏకీకృత నిర్ణయాన్ని తప్పుబట్టింది. పాకిస్థాన్ నీటి భద్రతకు ఇది పెను సవాల్ లాంటిదని, అలాగే సౌత్ ఆసియాలో శాంతికి విఘాతంగా పరిగణించాల్సి వస్తుందని ఈ మేరకు ఐరాస సమావేశంలో పాక్ అధికారులు పలు ప్రశ్నలు లేవనెత్తారు.
ఐరాసలో పాకిస్థాన్ కు చెందిన శాశ్వత దౌత్యవేత్త అసిమ్ ఇఫ్తికార్ ఇండస్ వాటర్ ట్రీటీ అండ్ పాకిస్థాన్ వాటర్ క్రైసిస్.. ఛాలెంజెస్ అండ్ ది వే ఫార్వార్డ్ అనే అంశంపై ప్రసంగించారు. నీటి భద్రత అంశం పాకిస్థాన్ కు ప్రధాన సమస్యగా మారిందన్నారు. పాకిస్థాన్ లో 80 శాతం భూభాగం సింధూ నదీ జలాలపైనే ఆధారపడి ఉందన్నారు. సింధూ జలాలను భారత్ నిలిపివేయడం.. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం అని అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా భారత్ నడుచుకోవాలని అసిమ్ ఇఫ్తికార్ స్పష్టం చేశారు.
అంతేకాక ఇటీవల పాకిస్థాన్ లో ఆకస్మిక వరదలు రావడానికి భారత్ కారణం అని తీవ్ర ఆరోపణలు చేశారు. డ్యామ్ నుంచి నీటి విడుదలపై భారత్ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని అందువల్ల పాక్ లో వరదలు సంభవించాయన్నారు. నీటిని ఆయుధంగా మలచుకోవద్దని.. అది ప్రజల ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఐరాస, వరల్డ్ బ్యాంక్, సివిల్ సొసైటీలు భారత్ పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది టూరిస్టులు మృతి చెందారు. దీంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో దాడులు చేసింది. అలాగే కఠినమైన నిర్ణయాలు తీసుకుంది.

సింధూ జలాల ఒప్పందం (IWT) సింధూ నది, దాని ఉప నదులలో లభ్యమయ్యే నీటిని ఉపయోగించుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ మధ్య ఒప్పందం జరిగింది. ఇది కరాచీలో 19 సెప్టెంబర్ 1960న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరియు పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య సంతకం చేయబడింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్ కు తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్ లపై, పాకిస్థాన్ కు పడమర నదులైన సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. ఈ ఒప్పందం వల్ల 80 శాతం నీటిని పాక్ వినియోగించుకుంటోంది.












Click it and Unblock the Notifications