‘‘నా ప్రైవేటు చాంబర్ కు రా..’’: మహిళా ఎంపీకి మంత్రి లైంగిక వేధింపులు
ఓ మహిళా ఎంపీకి నిండుసభలో అవమానం జరిగింది. సాక్షాత్తు మంత్రే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇస్లామాబాద్: ఓ మహిళా ఎంపీకి నిండుసభలో అవమానం జరిగింది. సాక్షాత్తు మంత్రే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో అవమానం పాలైన ఆమె ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించారు. ఈ ఘటన పాకిస్తాన్ లో జరిగింది.
పాకిస్తాన్ లోని సింధు ప్రావిన్స్ కు చెందిన మహిళా ఎంపీ నుస్రత్ షహర్ అబ్బాసీని ఉద్దేశించి సింధు ప్రావిన్స్ మంత్రి ఇమ్ దాద్ పితాఫి నిండు సభలో అసెంబ్లీలోని తన ప్రైవేటు చాంబర్ కు రావాలంటూ వెకిలి వ్యాఖ్యలు చేశాడు.
మంత్రి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తాను ఎంతగా నిరసన తెలిపినా, డిప్యూటీ స్పీకర్ ఒక మహిళ అయి ఉండి కూడా సదరు మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి నిరసనగా నుస్రత్ చేతిలో పెట్రోల్ బాటిల్ పట్ఠుకుని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. చట్ట సభల సాక్షిగా ఇలా చేయడం లైంగిక వేధింపులకు పాల్పడటమేనని విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడి జోక్యంతో మంత్రి ఇమ్ దాద్ పితాఫి దిగొచ్ఛారు. సభలో అందరిముందు క్షమాపణలు చెప్పారు. గౌరవసూచకంగా ఎంపీ నుస్రత్ షహర్ అబ్బాసీకి దుపట్టా కప్పి మన్నించాలని కోరారు. దీంతో ఆమె ఆయన్ని క్షమించారు.
ఇంతటితో ఈ వివాదం ముగిసినప్పటికీ లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ లభించడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని, మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా అవి అమలు కావడం లేదని ఎంపీ నుస్రత్ ఆవేదన వ్యక్తం చేశారు.