కరోనా మహమ్మారి అంతం కాలేదు, కొత్త రకాలు రావొచ్చు: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్
కేప్టౌన్: కరోనా వైరస్ మహమ్మారి ఇంకా అంతం కాలేదని, ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మరోసారి హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ శుక్రవారం మాట్లాడుతూ.. కోవిడ్ -19 మహమ్మారి ఇంకా ముగియలేదని, ఎందుకంటే మరిన్ని కరోనావైరస్ రకాల వచ్చే అవకాశాలున్నాయన్నారు.
'వైరస్ పరిణామం చెందడం, పరివర్తన చెందడం మనం చూశాము ... కాబట్టి మరిన్ని వైవిధ్యాలు, రకాలు ఉంటాయని మనకు తెలుసు, కాబట్టి మనం మహమ్మారి ముగింపులో లేము' అని సౌమ్య స్వామినాథన్ అన్నారు. దక్షిణాఫ్రికాలో వ్యాక్సిన్ తయారీ సౌకర్యాలను సందర్శించిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. స్వామినాథన్ విలేకరులతో అన్నారు. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్తో కలిసి వ్యాక్సిన్ తయారీ సౌకర్యాలను పరిశీలించారు.

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అమెరికాలో మాత్రం కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇది ఇలావుండగా, మనదేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 58,00,077 కొత్త కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 657 మంది మరణించారు. అంతకుముందు రోజుతో పోలిస్తే తాజాగా 13.4 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,97, 802కి చేరుకోగా.. అదే సమయంలో, కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,07,177కి పెరిగింది. ఇప్పటివరకు 4,13,31,158 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో కేరళలోనే 18,420 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గడంతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య మాత్రం బాగా పెరిగిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గిపోగా.. రికవరీ రేటు 97.17 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,97,802కి తగ్గాయి.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 172 కోట్ల యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్లు అందించారు. నిన్న ఒక్కరోజే 48 లక్షల 18 వేల 867 డోసులు ఇవ్వగా ఇప్పటి వరకు 172,79,51,432 డోసుల వ్యాక్సిన్ను అందించారు.












Click it and Unblock the Notifications