ఇన్నాళ్లు పెళ్లి బిజీ: ఇమ్రాన్ ఖాన్కు పెషావర్ స్కూల్ పేరెంట్స్ షాక్
పెషావర్: పీటీఐ పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్కు చుక్కెదురయింది. ఆయనను పెషావర్ ఆర్మీ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. ఇమ్రాన్ వెళ్లిపోవాలంటూ నినదించారు. గత ఏడాది డిసెంబర్ నెలలో పెషావర్లోని ఆర్మీ పాఠశాల పైన తాలిబన్లు దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో 142 మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు, సిబ్బంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ పాఠశాలకు వెళ్లారు. ఇమ్రాన్ ఖాన్ రావడంతోనే విద్యార్థుల తల్లిదండ్రులు గో ఇమ్రాన్ గో అంటూ నినాదాలు చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం రావొద్దని చెప్పారు. తల్లిదండ్రులు ఇమ్రాన్ ఖాన్ లోపలకు అడుగు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ మరో ద్వారం ద్వారా పాఠశాలలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆర్మీ పాఠశాలకు ఇమ్రాన్ ఖాన్ కొద్ది రోజుల క్రితం వెళ్లాలనుకున్నాడు. అయితే, ఆర్మీ చీఫ్ కూడా అదే రోజు వస్తుండటంతో మరో రోజు రావాలని సూచించారు. దీంతో ఆయన ఇప్పుడు వచ్చారు.
ఇమ్రాన్ పైన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పాఠశాలలో ఉన్న తమ పిల్లలు చనిపోయి నెల రోజులు కావొస్తోందని, ఇన్నాళ్లు పెళ్లి బిజీలో ఉండి, ఇప్పుడు రావడాన్ని వారు ప్రశ్నించారని తెలుస్తోంది. తమకు ఎవరి అవసరం లేదని, ఇటు ఇమ్రాన్ ఖాన్ అవసరం లేదా అటు నవాజ్ షరీఫ్ అవసరం లేదని వారు మండిపడ్డారు.
ఇన్నాళ్ల పాటు తన రెండో పెళ్లి బిజీలో ఉండి, ఇప్పుడు రావడం ఆయనకు సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాడని దుయ్యబట్టారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ను అడ్డుకోవడం వెనుక ఎవరున్నారో చెప్పేందుకు ఇమ్రాన్ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనుంది.