పోలీస్ దంపతులను కత్తితో పొడిచి చంపిన ఉగ్రవాది
ప్యారిస్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాలోని ఓర్లాండో ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో మరో ఉగ్ర ఘటన చోటుచేసుకుంది.
ఓ పోలీసు అధికారిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది పొడిచిపొడిచి చంపేశాడు. అంతకుముందు అతడి భార్య ప్రాణాలు కూడా తీశాడు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. ఈ దాడికి తెగబడే సమయంలో 'అల్లాహు అక్బర్' అంటూ ఆ ఉగ్రవాది గట్టిగా కేకలు పెట్టాడు. అయితే, ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ హంతకుడిని కాల్చి చంపేశారు.
ప్యారిస్లోని లెస్ మురియాక్స్ అనే చోట 42 ఏళ్ల పోలీసు అధికారి జీన్ బాప్టిస్ట్ సెల్వేంగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ అధికారి ఇంట్లోకి చొరబడ్డాడు. తొలుత అతడి భార్యను చంపేసి అనంతరం ఆ పోలీసు అధికారిపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా కత్తులతో పొడిచిపొడిచి చంపేశాడు. అనంతరం గట్టిగా అరుస్తూ బీభత్సం సృష్టించాడు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
అంతేగాక, ఓ హెలికాప్టర్ కూడా రంగంలోకి దిగింది. తొలుత అతడితో మాట్లాడి లొంగిపోయేలా చేసేందుకు ప్రయత్నించినా విఫలం కావడంతో ఇక చేసేది లేక అతడిని హతమార్చారు. పోలీసు అధికారి మూడేళ్ల కుమారుడు మాత్రం క్షేమంగా బయటపడ్డాడు.
ప్యారిస్ దాడుల అనంతరం పోలీసులపై వరుస దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండే తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ సహించరాని చర్య అన్నారు. భద్రతాదళాలు అప్రమత్తంగా ఉండి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఆదేశించారు.