భారత్తో మా బంధం అద్వితీయం: మోడీ కృషి ఉందన్న రష్యా అధ్యక్షుడు పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అత్యంత విశ్వసనీయమైన మిత్ర దేశంగా భారత్ను అభివర్ణించారు. రెండు దేశాల మధ్య మైత్రీబంధం కాలపరీక్షను తట్టుకుని దశాబ్దాలుగా బలోపేతం అవుతూ వస్తోందని పేర్కొన్నారు. భారత్ - రష్యాల అనుబంధాన్ని అత్యంత వ్యూహాత్మకమైన భాగస్వామ్య బంధంగా, ఎన్నో ప్రత్యేకతలను, విశిష్టతలను ప్రోది చేసుకున్నదిగా పుతిన్ పేర్కొన్నారు.
కొత్త అణు కర్మాగారాల నిర్మాణంతో పాటు సైనిక సాంకేతిక సహకారానికి సంబంధించి కూడా తన పర్యటనలో భాగంగా భారత నాయకత్వంతో చర్చిస్తానని వెల్లడించారు. రెండు దేశాల మధ్య సహకార స్ఫూర్తి తగ్గుతోందంటూ వచ్చిన విమర్శలను పుతిన్ తిరస్కరించారు. ఒకప్పుడు రష్యానుంచే భారత్ అనేక రకాలుగా దిగుమతులపై ఆధారపడేదని, కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాల స్థాయి పెరిగి సంయుక్తంగానే ప్రాజెక్టులను చేపట్టే స్థితికి చేరుకుందని వెల్లడించారు.

అనేక ఆధునిక వ్యవస్థలను సంయుక్తంగా చేపట్టడంతో పాటు రెండు దేశాలూ కలిసికట్టుగానే ఉత్పత్తులూ సాగిస్తున్నాయని పుతిన్ తెలిపారు. రష్యా, పాకిస్థాన్ల మధ్య సైనిక సహకారం విషయంలో భారత్ ఏవిధంగానూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, మాదకద్రవ్య ఆపరేషన్లకు సంబంధించి భారత్తో అనేక రకాలుగా చర్చలు జరిపానని వెల్లడించారు. ఈ రకమైన సహకారం వల్ల రెండు దేశాల ప్రయోజనాలు దీర్ఘకాల ప్రాతిపదికగా బలోపేతం అవుతాయని తెలిపారు.
ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో దేశాలమధ్య ఈ రకమైన సహకారం ఉగ్రవాద నిరోధనకు ఎంతగానో దోహదం చేస్తుందని పుతిన్ అన్నారు. భారత్లో ఒకరోజు పర్యటనను పురస్కరించుకుని పిటిఐ వార్తాసంస్థకు పుతిన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక, సైనిక, ఆర్థిక సంబంధాలను, ప్రస్తుత స్థితిగతులను విశ్లేషించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీని గౌరవనీయ రాజకీయ నాయకుడిగా అభివర్ణించారు. భారత్ - రష్యాల మధ్య పరస్పర సహకారం పెంపొందడం వెనుక నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా ఎంతో కృషి చేశారని పుతిన్ పేర్కొన్నారు.
తన తాజా పర్యటనలో రెండు దేశాల మధ్య వర్తక, ఆర్థిక సంబంధాలను విస్తరించుకునేందుకు బాటలు వేస్తామని తెలిపారు. పరస్పర పెట్టుబడులకు మరింత ప్రోత్సాహాన్ని అందించే వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. భారత్లో అణు విద్యుత్ కర్మాగారాలను నిర్మించడం సుఖోయ్ సూపర్ జెట్ ప్రాజెక్టును చేపట్టడం, అలాగే ఎంఎస్ 21 ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ను అందించడంతో పాటు హెలికాప్టర్ల నిర్మాణం, రష్యా టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్ సిటీలను ఉపయోగించడం వంటి అంశాలపై ఈ పర్యటనలో దృష్టి పెడతానని వ్లాదిమిర్ పుతిన్ వివరించారు.












Click it and Unblock the Notifications