బలూచిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం: 41 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బలూచిస్థాన్లోని లాస్బెలాలో 48 ప్రయాణికులతో కెట్టా నుంచి కరాచీ వెళుతున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బలూచిస్థాన్లోని లాస్బెలాలో 48 ప్రయాణికులతో కెట్టా నుంచి కరాచీ వెళుతున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. అనంతరం వాహనానికి మంటలు అంటుకున్నాయి. దీంతో బస్సులోని 41 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఓ మహిళ, చిన్నారి సహా ముగ్గురిని ప్రాణాలతో కాపాడామని లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్ అంజూ అంజుమ్ తెలిపారు. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
"స్పీడ్ కారణంగా, లాస్బెలా సమీపంలో యు-టర్న్ తీసుకుంటుండగా కోచ్ వంతెన పిల్లర్ను ఢీకొట్టింది. వాహనం తరువాత లోయలోకి పడిపోయింది. దీంతో మంటలు చెలరేగాయి' పోలీసు అధికారి చెప్పారు. ఈధి ఫౌండేషన్కు చెందిన సాద్ ఈధి మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఇప్పటివరకు 17 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. బలూచిస్థాన్ తాత్కాలిక గవర్నర్ మీర్ జాన్ ముహమ్మద్ జమాలీ ప్రాణనష్టం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
బలూచిస్థాన్ గవర్నర్ హౌస్ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేస్తూ.. "లాస్బెలా సమీపంలో జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో చాలా మంది ప్రాణాలను కోల్పోయినందుకు బలూచిస్తాన్ తాత్కాలిక గవర్నర్ మీర్ జాన్ ముహమ్మద్ జమాలీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి వెంటనే అన్ని వైద్య సదుపాయాలను అందించాలని ఆదేశించారు. కాగా, డ్రైవర్ల బాధ్యతారాహిత్యం, రోడ్లు సరిగా లేకపోవడం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు పాకిస్థాన్ లో తరచూ జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి.