ముగిసిన పాక్ స్కూల్ ఆపరేషన్: గుండె పగిలిందన్న మలాలా
పెషావర్: దాదాపు ఏడు గంటల పాటు సాగిన పాకిస్తాన్ దేశంలోని పాకిస్తాన్ పాఠశాల ఆపరేషన్ ముగిసింది. పాఠశాలను పాకిస్తాన్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. పెషావర్లో సైనిక పాఠశాలపై తాలిబన్లు దాడి చేసి ముక్కు పచ్చలారని అమాయకమైన పిల్లలను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనలో 138 మంది దాకా మరణించారు. మృతుల్లో 125 మంది విద్యార్థులే ఉన్నారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్ని దేశాల అధినేతలు సంఘటనను ఖండించారు.
ఆరుగురు ఉగ్రవాదులను పాకిస్తాన్ సైన్యం మట్టుబెట్టింది. పెషావర్లోని ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయింది. ఆస్పత్రులు రక్తదానం కోసం వేడుకుంటున్నాయి. ఈ సంఘటన నేపథ్యంలో బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు ప్రధాని నవాజ్ షరీప్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పెషావర్లోని గవర్నర్ హౌస్లో ఈ సమావేశం జరుగుతుంది.
తాలిబన్ల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ తెహ్రీక్ -ఐ - ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ఈ నెల 18వ తేదీ నుంచి తలపెట్టిన దేశవ్యాప్త నిరసనలను వాయిదా వేశారు. మహిళా టీచర్ను ఉగ్రవాదులు సజీవ దహనం చేశారు. పాక్ చరిత్రలో అత్యంత కిరాతకమైన చర్యగా ఇది నిలిచిపోతుంది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం చివరి ఆరో ఉగ్రవాదిని హతమార్చింది.
నిర్దాక్షిణ్యమైన కిరాతకమైన తాలిబన్ల చర్య కారణంగా తన గుండె పగిలిందని నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్జాహీ అన్నారు. 2012లో తాలిబన్లు మలాలా తలపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కిరాతక, పిరికిపంద చర్యలను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. భయానకమైన చర్యను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి, సైన్యానికి ప్రతి ఒక్కరు అండగా నిలువాలని ఆమె పిలుపునిచ్చారు.
17 ఏళ్ల మలాలా ప్రస్తుతం బ్రిటన్లో నివసిస్తున్నారు. అమ్మాయిలు చదువుకోవాలని ప్రచారం చేసినందుకు మలాలాపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రతీకార చర్యగానే తాము పాఠశాలపై దాడి చేశామని తెహ్రీక్ - ఎ - తాలిబన్ పాకిస్తాన్ తెలిపింది.