భారత్లో ఆ రంగంపై బాంబు పేల్చిన ట్రంప్- హైదరాబాద్పై తీవ్ర ప్రభావం
Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి కొరడా ఝుళింపించారు. అనేక దేశాలపై కొత్తగా అదనపు వడ్డింపులు వడ్డించారు. భారీగా టారిఫ్ను పెంచారు. ఈ జాబితాలో భారత్ సైతం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 26 శాతం మేర టారిఫ్ విధించారు భారత్పై.
ఇటీవలే ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను విధించారు ట్రంప్. 25 శాతం వరకు టారిఫ్ను పెంచారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై కిందటి నెల 31వ తేదీ నాడే సంతకం చేశారు. అమెరికాకు ఆటోమోటివ్ వాహనాలను ఎగుమతి చేస్తోన్న భారత్ సహా అన్ని అన్ని దేశాలపైనా దీని ప్రభావం పడినట్టయింది. ఈ టారిఫ్.. ఈ నెల 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

అక్కడితో ఆగట్లేదాయన. ఇప్పుడు కొత్తగా భారత్పై 26 శాతం వరకు టారిఫ్ విధించారు. భారత్ నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైనా ఈ పన్ను వర్తిస్తుంది. అంటే ఇప్పటివరకు ఉన్న టారిఫ్కు మరో 26 శాతం మేర అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మేక్ అమెరికా వెల్తీ అగైన్ కాన్సెప్ట్లో భాగంగా టారిఫ్ను విధించాల్సి వస్తోందంటూ వివరణ ఇస్తోన్నారు.
ఈ క్రమంలో మరో అడుగు ముందుకేశారు ట్రంప్. రక్షణ శాఖకు సంబంధించిన టెక్ దిగ్గజ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయడానికి సిద్ధపడ్డారు. బిలియన్ల కొద్దీ డాలర్ల కాంట్రాక్ట్లు రద్దు కానున్నాయి. ఫలితంగా ఐటీ రంగం తీవ్ర కుదుపులకు లోనవుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
అదే సమయంలో కొత్తగా ఫార్మాసూటికల్స్ రంగంపై టారిఫ్ విధించనున్నట్లు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. దీనితో పాటు కంప్యూటర్ చిప్స్పైనా టారిఫ్ విధిస్తానని వెల్లడించారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్లో ఎల్ సాల్వెడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలెతో సమావేశం అయ్యారు. పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు డొనాల్డ్ ట్రంప్ బదులిచ్చారు. టారిఫ్ల వల్ల దేశంలో వ్యతిరేకత పెరుగుతోందని, దీన్ని ఎలా ఎదుర్కొంటారంటూ అడిగిన ప్రశ్నను తేలిగ్గా తీసుకున్నారు. తాను తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికా వెల్తీగా మారుతుందని వ్యాఖ్యానించారు.
కొత్త టారిఫ్ల గురించి ప్రశ్నించగా.. ఫార్మాసూటికల్స్ అంటూ సమాధానం ఇచ్చారు. ఫార్మాసూటికల్స్ టారిఫ్ కమింగ్ సూన్.. అని చెప్పారు. అమెరికా సొంతంగా డ్రగ్స్, ఇతర మందులను తయారు చేయట్లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐర్లాండ్, చైనాల్లో మందులు తయారవుతున్నాయని, తాను చేయాల్సిందల్లా వాటిపై టారిఫ్ను విధించడమేనని అన్నారు.
టారిఫ్ ఎంత అధికంగా ఉంటే, అవి అంత త్వరగా అమెరికాకు వస్తాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కార్లు, ఇతర వాహనాలు, స్టీల్, అల్యూమినియం లాగానే ఫార్మాస్యూటికల్స్ రంగాన్ని టారిఫ్ల పరిధిలోకి తీసుకుని వస్తానని అన్నారు. ఈ విషయంలో తనకంటూ ఓ టైమ్లైన్ ఉందని పేర్కొన్నారు.
నిజానికి.. ఫార్మాసూటికల్స్ రంగంలో అమెరికాకు టాప్ సప్లయర్గా ఉంటోంది భారత్. గుజరాత్, మహారాష్ట్రతో పాటు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మందులు అక్కడికి ఎగుమతి అవుతున్నాయి. హైదరాబాద్ ఫార్మారంగానికి హబ్గా ఉంటోంది. 2023 నాటికి భారత్ నుండి అమెరికాకు 8.73 బిలియన్ డాలర్ల మేర మందులు ఎగుమతి అయ్యాయి. దేశ మొత్తం డ్రగ్ ఎక్స్పోర్ట్లో దాదాపుగా 35 శాతం.
ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఫార్మా ఒప్పందాల టారిఫ్లో హెచ్చుతగ్గులు ఉంటోన్నాయి చాలాకాలం నుంచి. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ విధిస్తోన్న డ్యూటీతో పోల్చుకుంటే ఇక్కడి నుండి అక్కడ దిగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్ చాలా తక్కువ. ఇదే అంశాన్ని ప్రస్తావించారు డొనాల్డ్ ట్రంప్. రెసిప్రోకల్ టారిఫ్ ఉంటుందని తెలిపారు.












Click it and Unblock the Notifications