పాక్ విమాన ప్రమాదం: పైలట్లు ఆ విషయంపై చర్చించారట.. అందుకే ప్రమాదం: రిపోర్ట్
గత నెలలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఒకటి కరాచీలో ప్రమాదంకు గురైన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 90కి పైగా ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఇక ఆ సంఘటనకు సంబంధించి పాకిస్తాన్ మంత్రి ఆ దేశ పార్లమెంటులో ప్రస్తావించారు. పైలట్లు విమానంపై దృష్టి కేంద్రీకరించకుండా ముచ్చట్లు పెట్టడం వల్లే ప్రమాదం జరిగిందని మంత్రి సభకు వివరించారు.

ప్రమాదానికి ముందు పైలట్ల చర్చ
గత నెల 22న పాకిస్తాన్ కరాచీ విమానాశ్రయంకు సమీపంలో జరిగిన పీకే -8303 విమాన ప్రమాదంపై పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ సంస్థ ప్రాథమిక విచారణ పూర్తి చేసింది. దీనికి సంబంధించిన రిపోర్టును పాకిస్తాన్ పౌర విమానాయాన శాఖ మంత్రి గులామ్ సర్వార్ పార్లమెంటుకు వివరించారు. ప్రమాదం జరగక అరగంట ముందు పైలట్లు ఇద్దరూ కరోనావైరస్ పై చర్చించుకున్నారని వారి కుటుంబ సభ్యులపై దాని ప్రభావం ఎలా ఉందనే విషయంపై మాట్లాడుకున్నారని మంత్రి సభకు వివరించారు. అంతేకాదు మితిమీరిన అతివిశ్వాసం కూడా ప్రమాదానికి కారణమైందని చెప్పారు.

ప్రమాదంకు కారణం పైలట్, ఏటీసీ
మే 22న జరిగిన పాక్ విమాన ప్రమాదంకు సంబంధించి ఆ విమానం ల్యాండింగ్లో రెండు సార్లు విఫలమైందని మంత్రి సర్వార్ వివరించారు. ఇక ఈ ప్రమాదంకు కారణం పైలట్, కో-పైలట్, ఏటీసీలే అని తేల్చి చెప్పారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని చెప్పిన మంత్రి , ఇదే విషయాన్ని ఏటీసీకి పైలట్ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే పైలట్ మరియు ఏటీసీలు ప్రొసిజర్ను ఫాలో కాలేదని చెప్పారు. అయితే పూర్తి విచారణ జరిగిన తర్వాత దాని రిపోర్టును త్వరలోనే బయటపెడతామని చెప్పారు. ఇక పైలట్లు, ఏటీసీ మధ్య జరిగిన సంభాషణ తానే స్వయంగా విన్నట్లు చెప్పారు మంత్రి సర్వార్

విమానం ఎత్తు గురించి పట్టించుకోని పైలట్లు
ఇదిలా ఉంటే విమానం రన్వేను రెండు సార్లు టచ్ చేసిందని అయితే ల్యాండింగ్ గేర్ లేకుండానే రన్వేను తాకి తిరిగి గాల్లోకి ఎగరడంతో ఇంజిన్లు ధ్వంసమైనట్లు నివేదిక పేర్కొంది. రెండో సారి గాల్లోకి ఎగరగానే రెండు ఇంజిన్లు డ్యామేజ్ అయినట్లు నివేదిక వెల్లడించింది. ఇక విమానం ఎత్తుగురించి ఏటీసీ అలర్ట్ చేయగా వాటిని పైలట్లు పెడచెవిన పెట్టారని మంత్రి సభకు వెల్లడించారు. మరోవైపు ఇంజిన్లు ధ్వంసమయ్యాయని ఏటీసీ కూడా పైలట్లకు చెప్పడంలో ఫెయిల్ అయ్యిందని మంత్రి చెప్పారు. విమానం ఎత్తు గురించి ఏటీసీ అలర్ట్ చేయగా పైలట్లు మాత్రం మేనేజ్ చేస్తామన్నట్లుగా వ్యవహరించారని మంత్రి నివేదికను చదివి వినిపించారు.
Recommended Video

నాడు ప్రత్యక్ష సాక్షులు ఏమి చెప్పారంటే
ఇక ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముందుగా ఈ విమానం జిన్నా గార్డెన్ ప్రాంతంలోని మోడల్ కాలనీలో ఉన్న ఓ టెలిఫోన్ టవర్ను ఢీకొట్టిందని ఆ తర్వాత ఓ ఇంటిపై కూలిందని చెప్పారు. విమానం కూలడంతో అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పారు. ఇక ఈ ఘోర దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. అప్పటి వరకు లాక్డౌన్ కారణంగా ఎయిర్పోర్టులకే పరిమితమైన విమానాలు పాక్ ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో తిరిగి ప్రారంభమైన వారంరోజులకే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం విశేషం. 7 డిసెంబర్ 2016 తర్వాత పాకిస్తాన్లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే అని ఆ దేశ ప్రభుత్వం చెబుతోంది. 2016లో పీఐఏ ఏటీఆర్-42 విమానం చిత్రాల్ నుంచి ఇస్లామాబాదుకు వెళుతున్న సమయంలో కూలింది. ఈ ప్రమాదంలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తానికి విమాన ప్రమాదంకు కారణం పైలట్లు, ఏటీసీనే అని చెప్పిన మంత్రి సర్వార్... పూర్తి నివేదికను త్వరలోనే బయటపెడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications