పాకిస్తాన్లో హిందూ దేవాలయంపై దుండగుల దాడి, ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని
కరాచీ: పాకిస్తాన్లో మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. సింధ్ ప్రావిన్స్లోని హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. హిందూ పవిత్ర గ్రంథాలకు, విగ్రహాలకు నిప్పు పెట్టారు. సింధ్ ప్రావిన్సులోని ఖైరాపూర్ జిల్లా కుంభ్ అనే ప్రాంతంలోని హిందూ దేవాలయంపై విధ్వంసానికి దిగారు.
ఈ విషయాన్ని పోలీసులు అధికారులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ సలహాదారు రాజేశ్ కుమార్ హర్దాశాని మాట్లాడుతూ... పాకిస్తాన్లోని హిందూ దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మతసామరస్యానికి భంగం కలిగించే యత్నాల్లో భాగంగానే గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారన్నారు.

హిందూ ఆలయాన్ని ధ్వంసం చేయడంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. వెంటనే విచారించాలని సింధ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇలాంటి చర్యలు తమ పవిత్ర గ్రంథం ఖురాన్కు వ్యతిరేకమన్నారు. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!