బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన వేళ.. ప్రధాని మోడీ గళం మారిందా: బోరిస్ జాన్సన్తో చర్చలు
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆరంభమైన భీకర యుద్ధం.. పతాక స్థాయిలో కొనసాగుతోంది. యుద్ధం ఆరంభమైన నెల రోజులు కావస్తోంది. దీని తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఉక్రెయిన్పై రష్యా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. దాదాపు అన్ని రీజియన్లపైనా పట్టు బిగించింది. తమ దేశ సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని నగరాలనూ ఆధీనంలోకి తెచ్చుకుంది. రాజధాని కీవ్ సహా మరియోపోల్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి రష్యా సైనిక బలగాలు రాకెట్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది.
ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా..
అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏ మాత్రం లెక్క చేయట్లేదు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ సహా యూరోపియన్ యూనియన్లోని అన్ని దేశాలు- రష్యాకు వ్యతిరేకంగా నిలిచాయి. ఆంక్షలను విధించాయి. నిషేధాజ్ఞలను జారీ చేశారు. ఆర్థికం, వాణిజ్యం, ఎగుమతి-దిగుమతులు.. ఇలా ఏ ఒక్క కేటగిరీలోనూ రష్యాతో సంబంధాలను కొనసాగించట్లేదు. చివరికి రష్యా పౌర విమానాల రాకపోకల కోసమూ తమ దేశ గగన తలాన్ని మూసివేశాయి. అయినా రష్యా తొణకలేదు.. బెణకలేదు.
ప్రధాని మోడీకి బోరిస్ జాన్సన్ ఫోన్కాల్
ఈ పరిణామాల భారత్-బ్రిటన్ ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, బోరిస్ జాన్సన్ ఫోన్లో చర్చలు జరిపారు. ఉక్రెయిన్ అంశంపై సుదీర్ఘకాలం పాటు వారి మధ్య ఈ సంభాషణ సాగింది. తాము సారథ్యాన్ని వహిస్తోన్న రష్యా వ్యతిరేక కూటమిలో చేరడానికి భారత్ వణికిపోతోందంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే- బోరిస్ జాన్సన్ రంగ ప్రవేశం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
చర్చల ద్వారానే..
యుద్ధంపై భారత్ అనుసరిస్తోన్న వైఖరిని ఈ సందర్భంగా ప్రధాని మోడీ మరోసారి పునరుద్ఘాటించారు. తాము తటస్థంగా ఉంటోన్న విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో- యుద్ధాన్ని తాము సమర్థించట్లేదని స్పష్టం చేశారు. యుద్ధానికి దిగడం ఏ దేశానికీ శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించారు. చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని మోడీ మరోసారి తేల్చి చెప్పారు. ఇదే గళాన్ని తాము ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపైనా వినిపించామని మోడీ గుర్తు చేశారు.
అంతర్జాతీయ చట్టాలను గౌరవించక తప్పదు..
ఏ దేశమైనా అంతర్జాతీయ చట్టాలను గౌరవించక తప్పదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని, చర్చల ప్రక్రియను ఆరంభించాల్సి ఉంటుందని సూచించారు. అంతర్జాతీయ చట్టాలు, ఆయా దేశాల సరిహద్దులు-సార్వభౌమత్వాన్ని తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పారు. అనంతరం భారత్-బ్రిటన్ మధ్య గల సంబంధాల గురించి ఇద్దరు ప్రధానమంత్రుల మధ్య చర్చలు సాగాయి. వాణిజ్యం, సాంకేతిక రంగం, పెట్టుబడులు, రక్షణ వ్యవస్థ, దేశ అంతర్గత భద్రత, స్వేచ్ఛా వాణిజ్యం.. వంటి పలు విషయాల మీద మోడీ-బోరిస్ జాన్సన్ సంభాషించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వివరించింది.