వాషింగ్టన్లో మోడీకి ఘన స్వాగతం పలికిన చిరుజల్లులు: ప్రొటోకాల్ పక్కన పెట్టి మరీ పలకరింపు
వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఆరంభమైంది. మూడు రోజుల పాటు ఆయన అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. వేర్వేరు సమావేశాల్లో పాల్గొంటారు. 2019 తరువాత నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఆ ఏడాది సెప్టెంబర్లో ఆయన అమెరికా వెళ్లారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ట్రంప్తో కలిసి హౌడీ మోడీ ఈవెంట్లోనూ పాల్గొన్నారు. ఆ తరువాత మళ్లీ అమెరికా చేరుకోవడం ఇదే తొలిసారి.
జో బైడెన్తో తొలిసారి ముఖాముఖి..
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలను స్వీకరించిన తరువాత- నరేంద్ర మోడీ ఆయనను కలుసుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. ఇప్పటిదాకా వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో కలుసుకున్నప్పటికీ.. ఇన్-పర్సన్ భేటీ కావడం ఇదే మొదటిసారి అవుతుంది. మార్చిలో క్వాడ్ మీటింగ్, ఏప్రిల్లో వాతావరణ మార్పులు, జూన్లో జీ-7 సదస్సులో వర్చువల్ విధానంలోనే కొనసాగాయి. కాగా ఈ దఫా క్వాడ్ మీటింగ్ ముఖాముఖిగా ఆరంభం కానుంది.
బంగ్లాదేశ్ తరువాత..
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదిన్నర కాలంగా ఆయన ఏ దేశ పర్యటనకు కూడా వెళ్లలేదు.. ఒక్క బంగ్లాదేశ్ తప్ప. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగమనే విమర్శలను ఎదుర్కొన్నారు అప్పట్లో. ఆ తరువాత మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లడం ఇదే మొదటిసారి.

బిజీబిజీగా షెడ్యూల్..
తన మూడు రోజుల పర్యటనలో భాగంగా మోడీ క్వాడ్ సమ్మిట్, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. ముఖాముఖిగా సాగనున్న క్వాడ్ సమ్మిట్లో ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధాన మంత్రులు స్కాట్ మోరిసన్, యోషిహిడె సుగాతో భేటీ అవుతారు. రేపు క్వాడ్ సమ్మిట్, ఎల్లుండి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమవేశంలో ప్రసంగించిన అనంతరం ఆయన స్వదేశానికి తిరుగు ప్రయాణమౌతారు.
ఇవ్వాళ ఉపాధ్యక్షురాలితో పాటు..
తొలి రోజు- ప్రధాని మోడీ ఇవ్వాళ అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్తో సమావేశమౌతారు. ద్వైపాక్షిక, వాణిజ్య పరమైన ఒప్పందాల గురించి చర్చిస్తారు. ఐసెన్ హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్లో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. అనంతరం వేర్వేరు రంగాలకు చెందిన అయిదు కంపెనీల ముఖ్య కార్యనిర్వహణధికారులతోనూ సమావేశమౌతారు. ప్రధాని భేటీ కాబోయే కంపెనీల సీఈఓల జాబితాలో క్వాల్కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ ఆటోమిక్స్, బ్లాక్స్టోన్ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులు ఉన్నారు. వాణిజ్యపరమైన భేటీలో భాగంగా విల్లార్డ్ హోటల్లో ఆస్ట్రేలియా ప్రధానిని కలుసుకుంటారు.
స్వాగతం పలికిన త్రివిధ దళాల బ్రిగేడియర్లు..
నిజానికి- విమానం దిగిన వెంటనే ఆయన నేరుగా హోటల్కు వెళ్లాల్సి ఉంది. అలా చేయలేదు. తన కోసం ఎదురు చూస్తోన్న ప్రవాస భారతీయులను పలకరించారు. తొలుత- విమానం దిగిన వెంటనే ప్రధానికి అమెరికాలోని భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు, బ్రిగేడియర్ అటాచ్ అనూప్ సింఘాల్, ఎయిర్ కమాండర్ అంజన్ భద్ర, నావల్ అటాచ్ కమాండర్ నిర్భయ బప్నా, అమెరికా మేనేజ్మెంట్ అండ్ రిసోర్సెస్ ఉప కార్యదర్శి టీహెచ్ బ్రియాన్ మెక్కెయాన్ స్వాగతం పలికారు.
Recommended Video

ప్రొటోకాల్ను పక్కన పెట్టి
అనంతరం ఆయన ప్రవాస భారతీయుల వద్దకు చేరుకున్నారు చిరుజిల్లుల పడుతున్నప్పటికీ.. లెక్క చేయలేదు. గొడుగు లేకుండానే వారి వద్దకు వచ్చారు. చిరునవ్వులతో పలకరిస్తూ, వారితో చేతులు కలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన హోటల్కు చేరుకున్నారు. అక్కడా పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ప్రధానికి స్వాగతం పలికారు. హోటల్ వద్ద తన కోసం ఎదురు చూస్తోన్న ప్రవాస భారతీయులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు.












Click it and Unblock the Notifications