భారత్ వేదికగా 2028 లో కాప్ 33 సదస్సు-దుబాయ్ కాప్ 28లో మోడీ ప్రతిపాదన..
వాతావరణ మార్పులపై దుబాయ్ లో జరుగుతున్న అంతర్జాతీయ కాప్ 28 సదస్సులో ప్రధాని మోడీ ఇవాళ కీలక ప్రసంగం చేశారు. ఇందులో ఆయన వాతావరణ మార్పులపై భారత్ తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూనే ఓ కీలక ప్రతిపాదన చేశారు. 2028లో జరగాల్సిన కాప్ 33 సదస్సుకు భారత్ ఆతిధ్యమిస్తుందని ప్రతిపాదించారు. వాతావరణ మార్పులను నియంత్రించేందుకు ఐరాస ఫ్రేమ్ వర్క్ కు భారత్ కట్టుబడి ఉందని మోడీ వెల్లడించారు.
అంతర్జాతీయంగా వాతావరణ మార్పులపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు ఐక్యరాజ్యసమితి నిబంధనన రూపకల్పన కోసం సదస్సులు నిర్వహిస్తోంది. వీటినే కాప్ సదస్సులుగా పేర్కొంటున్నారు. ఇప్పుడు దుబాయ్ లో జరుగుతున్న కాప్ 28 సదస్సుకు భారత్ ప్రతినిధిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాప్ 33కు తాము అతిధ్యమివ్వాలని భావిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రతిపాదన చేశారు. దీనిపై సభ్య దేశాలు స్పందించి నిర్ణయం ప్రకటిస్తాయి.

ప్రస్తుతం కాప్ 28 సదస్సు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో నవంబర్ 30న ప్రారంభమైంది. ఇది డిసెంబర్ 12 వరకు సాగనుంది. ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోడీ తన మనసులో మాట చెప్పారు. 2030 వరకు కర్బన ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించడమే భారతదేశ లక్ష్యమని ప్రధాని ప్రకటించారు. అలాగే శిలాజాయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 2070 నాటికి వీటిని సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
ఈ సదస్సులో భాగంగా మరో మూడు అత్యున్నత స్థాయి కార్యక్రమాలకు కూడా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ , కొత్తగా ఎన్నికైన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో సహా కొంతమంది నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరుగుతాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications