మోడీ బ్రిటన్ పర్యటన, బీహార్ ఎన్నికల ప్రభావం!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో బ్రిటన్లో పర్యటించనున్నారు. బీహార్ ఎన్నికలు ప్రధాని మోడీకి పెద్ద పరీక్ష. ఆయన హవా ఇంకా ఉందా లేదా అనే విషయం ఈ ఎన్నికల ద్వారా తెలుస్తుంది. నితీష్ కుమార్కు కూడా చావోరేవో వంటి అంశమే. అయితే, ప్రధాని మోడీకి అంతకంటే ఎక్కువే.
దీంతో, బీహార్ ఎన్నికల పైన దేశవ్యాప్తంగా అందరూ దృష్టి సారించారు. బీహార్ ఎన్నికల పైన భారత దేశంతో పాటు బ్రిటన్ కూడా ఆసక్తిగా పరిశీలిస్తోంది. బీహార్ ఎన్నికల ఫలితాలు ఆయన లండన్ పర్యటన పైన ప్రభావం పడనుందని అంటున్నారు. బిజెపి గెలిస్తే పెట్టుబడులకు సానుకూల అవకాశాలు ఎక్కువ అంటున్నారు.
అదే సమయంలో విదేశాల్లో పెరుగుతున్న మోడీ విశ్వసనీయతకు మరింత తోడవుతుందని చెబుతున్నారు.భారత్ మాదిరిగానే బ్రిటన్ మనవైపు నుంచి వివిధ రంగాల్లో సడలింపుల్నీ, సరళీకరణల్నీ ఆశిస్తోందని అంటున్నారు. ప్రధాని మోడీ బ్రిటన్ పర్యటనకు ముందు బ్రిటిష్ దౌత్యవేత్తలు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారంటున్నారు.
మరోవైపు, బిహార్ ఎన్నికలు కూడా ఆ దేశానికి ఆసక్తికరంగానే మారాయి. ఈ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే మోడీపై బ్రిటన్ పెట్టుబడిదారుల్లో విశ్వసనీయత మరింతగా పెరిగే అవకాశముందంటున్నారు.
ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం బీమారంగంలో విదేశీ కంపెనీలకు అవకాశం కల్పించడంతో బ్రిటన్ ఆనందం వ్యక్తం చేసింది. ఇతర రంగాల్లోనూ ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తోంది.
మరోవైపు, దేశంలో సున్నిత పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలోని ప్రధాని మోడీకి ఈ ఎన్నికలు ప్రతిష్టతో కూడుకున్నవే. గత ప్రభుత్వాల హయాంలోను మతఘర్షణలు ఉన్నప్పటికీ... ఇప్పుడు ఏ ఘర్షణ జరిగినా దానికి బిజెపి వైపు వేలు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.