Helle Lyng: మోడీని ప్రశ్నించి భారత్ లో ట్రెండింగ్ అవుతున్న నార్వే జర్నలిస్ట్..!
నిన్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తన యూరప్ పర్యటన సందర్భంగా నార్వేలోని ఓస్లోలో పర్యటించారు. అక్కడ నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్తో కలిసి మోదీ .. ఇరుదేశాల తరపున సంయుక్త పత్రికా ప్రకటన చేశారు. అక్కడ నార్వే జర్నలిస్ట్ హెలె లింగ్ స్వెండ్సెన్ (డాగ్సావిసెన్ వార్తాపత్రిక వ్యాఖ్యాత) ప్రధాని మోడీని ఉద్దేశించి పలు ప్రశ్నలు వేశారు. అయితే ఆయన వాటికి సమాధానం చెప్పకుండా అవేవీ వినిపించనట్లుగా వెళ్లిపోయారు. దీంతో మీడియా ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేరా అని మహిళా జర్నలిస్ట్ హెలె లింగ్ (helle lyng) ఆయన్ను ప్రశ్నించారు. అయినా ఫలితం లేదు.
అనంతరం మహిళా జర్నలిస్ట్ హెలె లింక్.. ఈ ఘటనపై ఎక్స్ లో ట్వీట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, నేను కూడా ఆయన ఇస్తారని ఆశించలేదన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో నార్వే మొదటి స్థానంలో ఉండగా, భారతదేశం మాత్రం పాలస్తీనా, ఎమిరేట్స్, క్యూబాలతో పోటీ పడుతూ 157వ స్థానంలో ఉందన్నారు. మనం సహకరించే శక్తులను ప్రశ్నించడం మన బాధ్యత అంటూ నార్వే-భారత్ సంబంధాలను సైతం గుర్తుచేశారు.

Primeminister of India, Narendra Modi, would not take my question, I was not expecting him to.
— Helle Lyng (@HelleLyngSvends) May 18, 2026
Norway has the number one spot on the World Press Freedom Index, India is at 157th, competing with Palestine, Emirates & Cuba.
It is our job to question the powers we cooperate… pic.twitter.com/vZHYZnAvev
మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ భారత్ ను ఎందుకు విశ్వసించాలి అనే విషయంపైనా, అలాగే మోడీ పర్యటన గురించినా కూడా ఈ రాత్రి నేను, నా సహోద్యోగి ప్రశ్నలు అడిగామని మరో ట్వీట్ లో ఆమె తెలిపారు. మానవ హక్కుల గురించి స్పష్టంగా చెప్పమని తాను మోడీని చాలాసార్లు అడిగానని, కానీ విఫలమయ్యానని వెల్లడించారు. మీడియా ప్రతినిధులు కోవిడ్ సమయంలో భారత్ చేసిన కృషి గురించి, యోగాతో పాటు ఇతర విషయాల గురించి కూడా మాట్లాడారని, తన సహోద్యోగి దగ్గర వీడియోలు ఉన్నాయి, వాటిని రేపు ప్రచురించడానికి ప్రయత్నిస్తానన్నారు.

అయితే మోడీని నార్వే జర్నలిస్ట్ హెల్లె లింగ్ ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆయన వాటిని పట్టించుకోకుండా వెళ్లిపోయిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత హెల్లె లింగ్ భారత్ లో ట్రెండ్ అవుతున్నారు. ఆమెను భారత్ లో బీజేపీ అనుకూల జర్నలిస్టులతో పోలుస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ విషయంలో ప్రథమ స్ధానంలో ఉన్న నార్వే జర్నలిస్టు అడిగిన ప్రశ్న సైతం 157వ స్ధానంలో ఉన్న భారత్ లో జర్నలిస్టులు అడగలేరా, అందుకే అంతర్జాతీయంగా ఈ స్ధానంలో ఉన్నట్లు సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు భారత్ లో పత్రికా స్వేచ్ఛ, మానవ హక్కులపై నార్వే జర్నలిస్ట్ హెల్లే లింగ్ అడిగిన ప్రశ్నలకు కేంద్రం గట్టిగా బదులిచ్చింది. "మనం ప్రపంచ మొత్తం జనాభాలో ఆరో వంతు ఉన్నాం, కానీ ప్రపంచ సమస్యలలో ఆరో వంతు మనవి కావు. ప్రజల ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చే రాజ్యాంగం మనకు ఉంది," అని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) సిబి జార్జ్ తెలిపారు. 'భారతదేశాన్ని ఎందుకు విశ్వసించాలి?' అని నార్వే జర్నలిస్ట్ హెలె లింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. భారతదేశ రాజ్యాంగం పౌరులందరికీ ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తుందని, ఆ హక్కుల ఉల్లంఘనలకు చట్టపరమైన పరిష్కారాలను అందిస్తుందని ఆ దౌత్యవేత్త పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications