రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధాని మోడీ ఫోన్: కీలక సూచన, భారతీయుల భద్రతపై చర్చ
న్యూఢిల్లీ/మాస్కో: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించిన క్రమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రష్యా వైమానిక దళాలు ఉక్రెయిన్పై దాడులతో విరుచుకుపడుతున్నాయి. సుమారు వందమంది వరకు సైనికులు, సామాన్య ప్రజలు మరణించారు. పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ఈ క్రమంలో ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు టెలిఫోన్లో మాట్లాడారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధాని మోడీ ఫోన్
'ఉక్రెయిన్కు సంబంధించి ఇటీవలి పరిణామాల గురించి అధ్యక్షుడు పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. రష్యా, నాటో మధ్య విభేదాలు నిజాయితీగా చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయని తన దీర్ఘకాల నమ్మకాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు' అని ప్రధానమంత్రి కార్యాలయం(PMO) వార్తా సంస్థ ఏఎన్ఐకి గురువారం రాత్రి తెలిపింది. ఉక్రెయిన్లో శాంతియుత పరిస్తితులు ఏర్పడేందుకు కృషి చేయాలని పుతిన్కు మోడీ సూచించారు.

ఉక్రెయిన్లో భారతీయుల భద్రతపై పుతిన్తో చర్చించిన మోడీ
ఉక్రెయిన్కు సంబంధించి ఇటీవలి పరిణామాలను అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోడీకి వివరించారు. ఉక్రెయిన్లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి భారతదేశ ఆందోళనలపై కూడా ప్రధాని మోడీ చర్చించారు. భారతదేశం, వారి సురక్షిత నిష్క్రమణ, తిరిగి రావడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుతం ఉక్రెయిన్ దేశంలో సుమారు 16వేల మంది భారతీయులు ఉన్నారు. వారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ సమీక్షిస్తోంది. బయటికి రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. ఉక్రెయిన్ గగనతలంలో నిషేధం ఎత్తివేసినవెంటనే భారత్ తిరిగి తీసుకొస్తామని వారికి భరోసా ఇచ్చింది. అంతకుముందు, ప్రధాని మోడీ గురువారం భద్రతపై కేబినెట్ కమిటీ (సిసిఎస్) సమావేశానికి నాయకత్వం వహించారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు.

ఉక్రెయిన్లోని 11 ఎయిర్ఫీల్డ్లు, 70కి పైగా సైనిక స్థావరాలు ధ్వంసం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలతో ఆ దేశ వైమానిక దళాలు ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నాయి. ఆ దేశంలోని 11 ఎయిర్ఫీల్డ్లతో సహా 70కిపైగా సైనిక స్థావరాలను తమ సైన్యం ధ్వంసం చేసినట్లు రష్యా గురువారం రాత్రి వెల్లడించింది. రష్యన్ బలగాలు జరిపిన దాడుల్లో 74 ఉక్రెనియన్ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. వీటిలో 11 ఎయిర్ఫీల్డ్లు ఉన్నాయని రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకొవ్ తెలిపారు. అంతేగాక, ఓ ఉక్రెయిన్ సైనిక హెలికాప్టర్ తోపాటు నాలుగు డ్రోన్లను కూడా కూల్చివేసినట్లు ఇగోర్ వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నప్పటికీ.. ఉక్రెయిన్ తన శక్తికి మించి రష్యా బలగాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి రష్యా జరిపిన దాడుల్లో 68 మంది సైనికులు, పౌరులు మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

మిలిటరీ విమానాన్ని కూల్చడంతో 14 మంది మృతి
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ రాజధానిపై బాంబు దాడులతో రష్యా విరుచుకుపడుతోంది. రష్యా దాడుల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో సైనికులు, సామాన్య ప్రజలు మరణించారు. తాజాగా, ఉక్రెయిన్ మిలిటరీకి చెందిన ఓ విమానాన్ని నేల కూలింది. దాదాపు 14 మందితో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ సైనిక విమానం రష్యా సైనికుల దాడిలో కుప్పకూలింది. దీంతో విమానంలోని 14 మంది సైనికులు మరణించారు. రాజధాని కైవ్ సమీపంలో విమానం కూలిపోయిందని ఉక్రెయిన్ అత్యవసర సేవలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎప్పీ తెలిపింది. ఉక్రెయిన్లో రష్యా సైనికులు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 40 మందికిపైగా చనిపోయారు. లుహాన్స్క్ ప్రాంతంపై రష్యా విమానాన్ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ గతంలో పేర్కొంది. వైమానిక రక్షణను 'అణచివేస్తూ' ఉక్రెయిన్ వైమానిక స్థావరాలలో సైనిక మౌలిక సదుపాయాలను చేపట్టడాన్ని కూడా రష్యా ధృవీకరించింది.












Click it and Unblock the Notifications