ఐర్లాండ్లో సంస్కృతం:భారత్ సెక్యులరిస్ట్లకి మోడీ చురక
డబ్లిన్: ఏడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఐర్లాండులో ప్రధాని నరేంద్ర మోడీకి రాజధాని డబ్లిన్లో ఘన స్వాగతం లభించింది. సంస్కృత శ్లోకాలు, భరత నాట్యంతో స్థానిక చిన్నారులు మోడీకి స్వాగతం పలికారు. చిన్నారుల లయబద్ధ సంస్కృత శ్లోక పఠనంతో మోడీ ముగ్దులయ్యారు.
అమెరికా పర్యటనకువెళ్తూ... మధ్యలో ఐర్లాండు రాజధాని డబ్లిన్లో ఆగారు. అక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ - ఐర్లాండ్ మధ్య చాలా విషయాల్లో సారూప్యం ఉందన్నారు. రెండు దేశాలూ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం సంపాదించుకున్నాయన్నారు.
స్వాగత కార్యక్రమంలో చిన్నారుల సంస్కృత శ్లోకాలు విని ముగ్దుడనయ్యానని, ఇలాంటి కార్యక్రమం భారత్లో జరిగి ఉంటే సెక్యులరిజం పైన ఎన్నో ప్రశ్నలు తలెత్తేవన్నారు. అమెరికా వెళ్లడంలో భాగంగా నాలుగు గంటల పాటు ఐర్లాండ్లో ఆగిన ప్రధాని మోడీ భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఉత్సాహభరితమైన రీతిలో మాట్లాడారు.
సంస్కృతంలో ఉన్న శ్లోకాలను ఐర్లాండ్ పిల్లలు చెప్పడం, తనకు స్వాగతం పలుకుతూ పాటలు పాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ శోక్లాలు వారు బట్టీ పట్టినవి కాదని, ఎందుకంటే ఆ పదాల్లోని భావాన్ని, అర్థాన్ని కూడా చాలా స్పష్టంగా వ్యక్తీకరించగలిగారన్నారు.
ఐర్లాండ్లో కూడా ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం చిరస్మరణీయమైన అనుభూతిని అందించిందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ గురించే మాట్లాడుకుంటున్నాయన్నారు.
21వ శతాబ్దం భారత్దేనన్న భావనకూ బలం చేకూరుతోందన్నారు. ఐదు దేశాల కూటమిలో బలంగా ఉందంటే అది భారత దేశమేనని ప్రధాని మోడీ అన్నారు. అభివృద్ధి వేగాన్ని నిలబెట్టుకోగలిగితే భారత్లో పేదరికమే ఉండదన్నారు.