ఉగ్రవాదానికి కొన్ని మా దేశ రాజకీయ పార్టీల మద్దతు: పాక్ చీఫ్ జస్టిస్ సంచలనం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్కు చెందిన చీఫ్ జస్టిస్ అన్వర్ జహీర్ జమాలీ దేశంలోని తీవ్రవాదం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు రోజుల క్రితం భారత్లోని యూరి సెక్టారులో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పాకిస్థాన్లోని కొన్ని రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్నాయని ధ్వజమెత్తారు.
దీంతో న్యాయవ్యస్థను చేతుల్లోకి తెచ్చుకునేందుకు జడ్జీలు, న్యాయవాదుల్లో భయాన్ని కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్నారు. పాకిస్తాన్ అంతర్గత ప్రయోజనాల దృష్ట్యా ఉగ్రవాదం వృద్ధి చెందుతోందన్నారు. దేశం సుస్థిరంగా ఉండాలంటే ఉగ్రవాదంపై ఆధారపడడం కాకుండా ప్రభుత్వ వ్యవస్థలు సక్రమంగా పని చేయాలని హితవు పలికారు.
రాష్ట్రపతి ప్రణబ్ను కలిసిన ప్రధాని నరేంద్ర మోడీ
యూరి ఉగ్రదాడి నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. మంత్రులు, అధికారులతో భేటీ అనంతరం ఈ సమావేశం జరిగింది.
కాశ్మీర్లో మరో దాడి
యూరి దాడి మరవకముందే జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు ఉనికిని చాటుకున్నారు. హంద్వారా ప్రాంతంలోని లాంగేట్ పట్టణంలోఓ పోలీసు చెక్పోస్ట్ పై సోమవారం సాయంత్రం కాల్పులకు దిగారు. ఈ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు పాలుపంచుకున్నారో తెలియరాలేదు. సమాచారం తెలియాల్సి ఉంది.