మూడవ ప్రపంచ యుద్ధం మొదలైంది: పోప్ ప్రాన్సిస్
పారిస్: పారిస్పై జరిగిన ఉగ్రదాడితో 'మూడో ప్రపంచ యుద్ధం' మొదలైందని పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు. ఉగ్రదాడి తనను కలిచివేసిందని, అమాయకుల ప్రాణాలను హరించే హక్కు ఏ వ్యక్తికీ లేదని ఆయన అన్నారు.
వాటికన్ నుంచి ఇటాలియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ అధికారిక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. బాధితుల్లో తాను ఒకడినని, ఈ దాడులు తనను తీవ్రంగా కలచి వేశాయన్నారు.
వేలంవెర్రి ద్వేషాన్ని ఉగ్రవాదులు ఒంటినిండా నింపుకున్నారని, మనుషులే ఇటువంటి పనులు చేయడాన్ని తన మనసు తట్టుకోలేకుండా ఉందన్నారు. ఈ నరమేధాన్ని ఖండించేందుకు సైతం తాను మాటలు వెతుక్కోవాల్సి వస్తోందని ఆయన వాపోయారు.
'నేను తీవ్రంగా కలత చెందాను. మనుషులు చేస్తున్న ఇటువంటి పనులను అర్ధం చేసుకోలేక పోతున్నాను. వారి దుశ్చర్యలకు ఓ పరిధి లేదు. మతం లేదు. మానవత్వం లేదు. ఇది అమానవీయం' అని వ్యాఖ్యానించారు.
శుక్రవారం నాడు ఉగ్రవాదులు పారిస్లో జరిపిన దారుణ మారణకాండలో సాక్షాత్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు పాల్గొన్న ఓ పుట్బాల్ మ్యాచ్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి దిగిన సంగతి తెలిసిందే.
ముందుగా ఫ్రాన్స్-జర్మనీ జట్ల మధ్య ప్రెండ్లీ మ్యాచ్ జరుగుతున్న స్టేడ్ డి ఫ్రాన్స్ మైదానం వద్ద ముగ్గురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి దిగారు. మ్యాచ్ మొదలైన 16వ నిమిషంలో తొలి బాంబు పేలింది.
స్టేడియంలో ఉన్న అందరికీ ఆ శబ్ధం స్పష్టంగా వినిపించింది. అయినా మ్యాచ్ కొనసాగుతూనే ఉంది. మూడు నిమిషాల తర్వాత మరో బాంబు పేలింది. బాంబు పేలుళ్లతో అప్రమత్తమైన అధికారులు ప్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ను అక్కడి నుంచి తరలించారు.
దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. స్టేడియంలోని రెండు ఫాస్ట్ పుడ్ దుకాణాల వద్ద ముగ్గురు ఉగ్రవాదులు తమ ఒంటిపై అమర్చుకున్న బాంబులు పేల్చుకుని చనిపోయారని పోలీసుల దర్యాప్తులో తేలింది.