రక్తమోడుతున్న బాల్యం, తల్లడిల్లుతున్న సోషల్ మీడియా, ‘ప్రే ఫర్ సిరియా’ హ్యాష్ట్యాగ్తో...
Recommended Video
వాషింగ్టన్: సిరియాలో రక్తమోడుతున్న బాల్యంపై సోషల్ మీడియా తల్లడిల్లుతోంది. తుపాకుల తూటాల నడుమ, విస్ఫోటన శిథిలాలలో నెత్తుటి చారికలతో బిక్కుబిక్కుమంటున్న అమాయక పసి మోములు, కల్మషం లేని చిన్నారుల ఫొటోలు ఇప్పుడు నెటిజన్లను కదిలిస్తున్నాయి.
ఒకప్పుడు యుద్ధ సంక్షోభ సిరియా నుంచి సురక్షిత ప్రాంతానికి పడవలో వెళ్తూ మృతిచెందిన చిన్నారి అలన్ కుర్దీ ఫొటో యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతపరిచింది. సముద్రం ఒడ్డున విగతజీవిగా పడి ఉన్న ఆ బాలుడి ఫొటో అప్పట్లో అందరినీ కదిలించింది. తాజాగా నెత్తుటి చారికలతో బిక్కుబిక్కుమంటున్న పసివాళ్ల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
నలిగిపోతున్న పాపం పసివాళ్లు...
సిరియాలో ప్రభుత్వ దళాలు, వేర్పాటువాద మిలిటెంట్లు, ఉగ్రవాద సంస్థల మధ్య నిత్యం యుద్ధం కొనసాగుతూనే ఉంది. తుపాకుల తూటాలు, విస్ఫోటన శబ్ధాలు, శిథిలమయ్యే భవనాలు, వాటికింద పడి ప్రాణాలు వదిలే పసివాళ్లు.. ఇదంతా అక్కడ నిత్య కృత్యం. సిరియాలో నరమేధం, సాగుతున్న హింసాకాండలో ఛిద్రమవుతున్న చిన్నారుల ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
హ్యాష్ట్యాగ్ ఉద్యమం...
‘ప్రే ఫర్ సిరియా' (సిరియా కోసం ప్రార్థించండి) అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఈ ఫొటోలను పంచుకుంటున్నారు. సిరియాలో ఛిన్నాభిన్నం అవుతోన్న బాల్యాన్ని కాపాడాలని, మానవత్వాన్ని చూపాలని, ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న బాలల్లాగే అక్కడి చిన్నారులకు కూడా సంతోషంగా బతికే హక్కు కల్పించాలని, ఈ దిశగా ప్రపంచ దేశాల్ని కదిలించాలని కోరుతూ ప్రస్తుతం ఈ హ్యాష్ట్యాగ్ ఉద్యమం నడుస్తోంది.
మెహ్రీన్ ఫిర్జాదా ట్వీట్...
తాజాగా టాలీవుడ్ నటి మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఈ హ్యాష్ట్యాగ్ జోడించి సిరియా చిన్నారి ఫొటోను ట్వీట్ చేశారు. సిరియాలో చిన్నారులు ఎదుర్కొంటున్న హింస, కూరత్వం, చిన్నారుల మారణహోమాన్ని చూస్తే హృదయం ద్రవించుకుపోతోందని, మానవత్వాన్ని చాటుతూ అక్కడ శాంతి కోసం ప్రార్థించాలని ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు.
జనావాసాలపై బాంబుల జారవేత...
కొద్ది రోజులుగా సిరియాలోని గౌటా నగరంపై ప్రభుత్వ దళాలు.. అక్కడి మిలిటెంట్లపై కొనసాగిస్తున్న దాడుల్లో కనీసం 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 200 మంది చిన్నారులు, 110 మంది మహిళలు కూడా ఉన్నారు. వైమానిక దాడుల్లో ఆస్పత్రి భవనాలు, వందలకొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. ముందస్తుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆ తర్వాత మిలిటెంట్లపై దాడులు చేయాల్సిన ప్రభుత్వాలు.. ఏకబిగిన జనావాసాలపై బాంబులు జారవిడుస్తున్నాయి. దీంతో గౌటాలో ఎక్కడిక్కడ నెత్తురు ఏరులైపారుతోంది.
ప్రభుత్వంపై యుద్ధమే...
సిరియా రాజధాని డమస్కస్లోని శివారు నగరమైన గౌటా అయిదేళ్ల క్రితం ప్రభుత్వ బలగాల అధీనంలోనే ఉండేది. ఇతర ప్రాంతాల్లో చావుదెబ్బతిన్న మిలిటెంట్లు వేలమంది.. సాధారణ జనంతో కలిసిపోయి గౌటా నగరంలోకి చొచ్చుకొచ్చారు. 2017 నాటికి వారు తిరిగి ఆయుధ సంపత్తిని సమకూర్చుకుని గౌటాలో సొంత పెత్తనం చెలాయించే స్థితికి చేరుకున్నారు. తహ్రీర్ అల్ షమ్, అల్ రహమాన్ లీజియన్, జైష్ అల్ ఇస్లామ్ తదితర గ్రూపులు తమలో తాము కలహించుకుంటూ, ప్రభుత్వ బలగాలతోనూ తలపడుతూ జనాన్ని కాల్చుకు తింటున్నాయి.
ఈ పిల్లలు చేసిన తప్పేంటి?
పాకిస్తాన్లోని లాహోర్కు చెందిన హుస్సేన్ మాలిక్ అనే మరో నెటిజన్ కూడా సిరియాలో చిన్నారుల దయానీయ స్థితిపై ట్వీట్ ద్వారా స్పందించారు. అమాయకమైన ముఖాలతో కనిపిస్తున్న ఆ చిన్నారుల ఫొటోలు చూస్తోంటే హృదయం ద్రవిస్తోందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వారు జోక్యం చేసుకుని మానవత్వంతో స్పందించాలని ఆయన కోరారు. సిరియాలో ఇంత జరుగుతోంటే బయటి ప్రపంచం ఎందుకు మౌనంగా ఉంటోంది? ఆ చిన్నారులు చేసిన తప్పేంటి? అని హుస్సేన్ మాలిక్ తన ట్విట్లో ప్రశ్నించారు.