అత్యంత 'అవినీతి మీడియా' అవార్డులు: డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం
వాషింగ్టన్: అధ్యక్షులు అయినప్పటి నుంచి నిత్యం అందరి నోళ్లలో నానుతున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. అత్యంత అవినీతి, అత్యంత చెత్త మీడియా అవార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
నా టేబుల్ వద్దా అణుబటన్ ఉంది: కిమ్కు ట్రంప్ హెచ్చరిక
అధ్యక్ష ఎన్నికల సమయం నుంచే ప్రముఖ మీడియా సంస్థలపై ఆయన గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా.. అత్యంత నిజాయితీ లేని, అవినీతి మీడియా అవార్డులు ఇస్తానని తెలిపారు.
తనకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని అమెరికాలో ప్రఖ్యాత మీడియా సంస్థలైన సీఎన్ఎన్, ఏబీసీ న్యూస్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ తదితర మీడియా సంస్థలపై ట్రంప్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది అత్యంత నిజాయితీ లేని, అవినీతి మీడియా అవార్డులను సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రకటిస్తానని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఫేక్ న్యూస్ మీడియాలో వివిధ విభాగాల్లో నిజాయితీ లేని, చెత్త రిపోర్టింగ్ను బట్టి అవార్డులు ఇస్తామన్నారు.
ఫాక్స్ న్యూస్ తప్ప మిగతా మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయని ట్రంప్ గత నవంబరులోనే పేర్కొన్నారు. ఇతర మీడియా సంస్థల్లో వచ్చిన పలు కథనాల్లో నిజం లేదని తేల్చిన తర్వాత ఆ కథనాలకు సంబంధించిన జాబితాను ఫాక్స్ న్యూస్ ప్రచురించినప్పుడు ట్రంప్ ఆ ట్వీట్ చేశారు. గతంలో ట్రంప్ ప్రచార బృందం 2017 కింగ్ ఆఫ్ ఫేక్ న్యూస్ ట్రోఫీకి నామినేషన్లు కూడా కోరింది.