వైరస్ విధి వైచిత్రి.. ‘కంటేజియన్’ సైంటిస్టుకు కరోనా కాటు.. లాక్ డౌన్లో ఆ సినిమాలే చూస్తున్నారు..
హాలీవుడ్ లో ఇండిపెండెంట్ సినిమాల హవా పెరగడానికి కారకులైన వారిలో ప్రముఖుడు స్టీవెన్ సోడర్ బర్గ్. తొమ్మిదేళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో రూపొందిన 'కంటేజియన్' సినిమా ప్రస్తుతం ప్రపంచ హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఎందుకంటే, ఇవాళ మనం ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారి ముప్పును.. అచ్చుగుద్దినట్లు చూపించారయన. థ్రిల్లర్ జానర్ లో స్టీవెన్ తీసిన ఆ సినిమాకు తెరవెనుక సహకారం అందించింది మాత్రం ఇయాన్ లిప్కిన్ అనే ఎపిడమాలజిస్ట్. ఇప్పుడాయన కూడా కరోనా కాటుకు గురికావడాన్ని విధి వైచిత్రిగా జనం మాట్లాడుకుంటున్నారు.
సైంటిఫిక్ సినిమా కాబట్టే..
ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీలో ‘ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ' విభాగానికి డైరెక్టర్ గా పనిచేస్తున్న ఇయాన్ లిప్కిన్.. వైరస్ల పుట్టుక, వాటి వ్యాప్తి గురించి విపరీతంగా పరిశోధనలు చేశారు. ఇప్పటి కరోనా లాగే, 20 ఏళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన సార్స్ మహమ్మారిని నిరోధించిన సైంటిస్టుల బృందంలో ఆయనది ముఖ్యపాత్ర. ‘కంటేజియన్'ను సైంటిఫిక్ కోణంలోనే తెరకెక్కిస్తానని సోడర్ బర్గ్ మాటివ్వడంతో లిప్కన్ ఆ సినిమాకు కన్సల్టెంట్ సైంటిస్టుగా పనిచేశారు. వైరస్ వ్యాప్తి గురించి సినిమాలో చూపించిన ప్రతి అంశం ఆయన పరిశోధించి వెల్లడించిందేకావడం గమనార్హం. ఇదిలా ఉంటే..
అప్పుడే హెచ్చరించినా..
రెండ్రోజుల కిందట.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇయాన్ లిప్కిన్.. తాను కొవిడ్-19 పేషెంట్నని లైవ్ లో ప్రకటించారు. ఆ వైరస్ తనకు ఎలా అంటుకుందో కచ్చితంగా తెలుసని, అయితే వివరాలు మాత్రం బయటికి వెల్లడించబోనని చెప్పారు. వైరస్ పై పరిశోధనల్లో భాగంగా ఈ ఏడాది జనవరిలో చైనాకు వెళ్లి.. కరోనా పుట్టిన వూహాన్ సిటీలో ఆయన పర్యటించారు. అమెరికాకు తిరిగొచ్చిన తర్వాత రెండు వారాలపాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అప్పుడు సేఫ్ గానే బయటపడినా.. ఇప్పుడు కరోనా అమెరికాలో విలయతాండవం చేస్తూ ఆయనకూ పాకింది. చైనాలో కరోనా తీరును స్వయంగా చూశాక.. ‘‘ఇది ప్రపంచానికి కూడా ముప్పు తలపెట్టే మహమ్మారిగా మారుతుంది''అని రెండు నెలల కిందటే హెచ్చరించారాయన.
దయచేసి వినండి..
ఇంకా మందులు అందుబాటులోకి రాని మహమ్మారి వైరస్ లను నిరోధించాలంటే ‘సోషల్ డిస్టెన్స్' పాటించడం ఒక్కటే మార్గమని లిప్కిన్ చెబుతున్నారు. ఇదే విషయాన్ని ‘కంటేజియన్' సినిమాలోనూ ఆయన బలంగా చెప్పారు. అమెరికాలో కరోనా విజృంభణపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ‘‘మనం ముందే మేల్కొని ఉండాల్సింది''అని వాపోయారు. ఇప్పటికైనాసరే, న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో రాష్ట్రాలు మేల్కొని షట్ డౌన్ ప్రకటించడం శుభపరిణామమని, విశాలమైన అమెరికాలో మరింత నియంత్రణ పెడితే తప్ప వైరస్ ను అదుపుచేయలేమని చెప్పారు. ప్రస్తుతం లిప్కిన్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో కరోనా వల్ల ఇప్పటికి 1,301 మంది చనిపోగా, దాదాపు 86 వేల మంది వైరస్ బారినపడ్డారు.
ఆ సినిమాలకు భారీ డిమాండ్..
‘కంటేజియన్' సినిమాలో ‘ఎంఈవీ-1'పేరుగల వైరస్.. గబ్బిలం ద్వారా వ్యాప్తి చెంది మొట ఓ పందికి సోకుతుంది. హాంకాంగ్ లోని ఒక స్టార్ హోటల్ లో ఆ పంది మాంసాన్ని వండిన చెఫ్ ద్వారా మిగతా వాళ్లకు వైరస్ వ్యాప్తి చెందినట్లు చూపిస్తారు. నిజంగా కరోనా వైరస్ కూడా వూహాన్ సిటీలోని మాంసం మార్కెట్ నుంచే వ్యాప్తి చెందినట్లు సైంటిస్టులు కనుగొనడంతో.. సినిమాలో చూపెట్టిన విషయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. కరోనా వ్యాప్తి తర్వాత ‘కంటేజియన్'తోపాటు ‘పడెమిక్', ‘ప్లేగ్' సినిమాలతోపాటు ‘నిఫా' మహమ్మారి నేపథ్యంలో రూపొందిన మలయాళ సినిమా ‘వైరస్'నూ లక్షల మంది వీక్షించారు. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైపోయిన మనం కూడా ఈ సినిమాలు చూసి, వైరస్ వ్యాప్తిని, ఆ సమయంలో మనం అనుసరించాల్సిన సామాజిక బాధ్యత గురించి తెల్సుకోవచ్చు.