Protest against CAA: హక్కులను కాలరాయడమే.. విదేశాల్లో భారీగా ఆందోళనలు
పౌరసత్వ సవరణ చట్టంను నిరసిస్తూ దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా ఆందోళనలు భారీగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోగా ఫిన్లాండ్, బెల్జియంలో పలువురు శాంతియుత ప్రదర్శనలు చేయడం గమనార్హం. ఫిన్లాండ్ నిరసనకారులు మాట్లాడుతూ..
ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో వివాదాస్పద చట్టాన్ని నిరసిస్తూ 50 మందికిపైగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి వివక్ష లేకుండా ఎందరో శరణార్థులను అక్కున చేర్చుకొన్న సుదీర్ఘ చరిత్ర, సంప్రదాయం ఉంది. పలు రకాల ఆలోచనలు, వాదాలు భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయంలో ఓ భాగం అని నిరసనకారులు అభిప్రాయపడ్డారు. అలాంటి చరిత్ర ఉన్న దేశంలో దారుణమైన వివక్ష తావిచ్చే పౌర సవరణ చట్టాన్ని తీసుకురావడం దారుణం. శరణార్థులు, కాందీశీకుల హక్కులను, ప్రయోజనాలను కాలరాయడమేని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
బెల్జియంలో కూడా భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రజాస్వామ్య విధానాలకు, భారతీయ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని వారు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఆందోళన ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. నిరసనలు, ఆందోళనలు ఊపందుకోవడంతో లక్నో, కాన్పూర్, అలహాబాద్, ఆగ్రా, ఘజియాబాద్, వారణాసి, మథుర, మీరట్, మొరాదాబాద్, ముజఫర్నగర్, బరేలి, ఫిరోజాబాద్, ఫిలబిత్, రాంపూర్, సహారన్పూర్, షామిలీ, సంభాల్, అమ్రోహా, మావ్, ఆజయ్గఢ్, సుల్తాన్పూర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆలీగఢ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించడం గమనార్హం.