ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్బాల్ పిచ్ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
ఖతార్లోని లుసైల్ స్టేడియంలో ఆదివారం అర్జెంటీనా, ఫ్రాన్స్ల మధ్య ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
ఫైనల్ మ్యాచ్ జరుగనున్న ఈ పిచ్పై టోర్నమెంట్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 300 టన్నుల నీటిని ఉపయోగించారు.
ఖతార్లోని ఎడారి వాతావరణం కారణంగా గ్రౌండ్లోని టర్ఫ్ ఆటకు అనుకూలంగా ఉండేందుకు గ్రౌండ్ స్టాఫ్ ప్రతీరోజూ 10 వేల లీటర్ల కంటే ఎక్కువ నీటిని పిచికారీ చేస్తున్నారు.
ఖతార్లో డజన్ల కొద్దీ పిచ్లు ఉన్నాయి. వీటిని టోర్నమెంట్ మ్యాచ్లు, ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తున్నారు.
ప్రపంచంలో నీటి కొరతతో అత్యంత ప్రభావితమైన దేశాల్లో ఖతార్ కూడా ఒకటి. పిచ్ను తడిగా, మైదానాన్ని పచ్చగా ఉంచడానికి భారీ మొత్తంలో నీటిని వినియోగిస్తున్నారు. టోర్నీ నిర్వహణలో ఖతార్ ఎదుర్కొంటున్న సవాళ్లలో నీరు కూడా ఒకటి.
ఖతార్ తన పురోగతిని కొనసాగించడంతో పాటు పర్యావరణంపై దాని ప్రభావాన్ని కూడా పరిమితం చేయాలి.
- ఖతార్: ఫిఫా ప్రపంచకప్ 2022.. 'మెస్సీ వరల్డ్ కప్’ కానుందా? ఫైనల్లో అర్జెంటీనా విజయం సాధిస్తుందా?
- 974: ఏకంగా ఫుట్బాల్ స్టేడియాన్నే తరలించేస్తున్నారు
ఎడారి దేశం
ఎనిమిది వరల్డ్ కప్ స్టేడియాల్లో గ్రౌండ్ స్టాఫ్ అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
ఒకవేళ ఈ వరల్డ్ కప్ను ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం వేసవిలో నిర్వహిస్తే, 136 ప్రాక్టీస్ పిచ్లతో సహా ఒక్కో పిచ్కు ప్రతీరోజూ 50 వేల లీటర్ల నీరు అవసరం అయ్యేది.
ఖతార్లోని మైదానాల్లో పిచ్లను తయారు చేసే సిబ్బంది, ఇక్కడి పిచ్ల నిర్వహణ గురించి మాట్లాడుతూ తమ దేశంలోని పరిస్థితులతో పోలిస్తే ఇక్కడ ఎదురవుతున్న సవాళ్లు చాలా భిన్నంగా ఉన్నాయని అంటున్నారు.
అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే వినియోగించడం కోసం ఖతార్ రాజధాని దోహాకు ఉత్తరాన 4,25,000 చ.కి.మీ విస్తీర్ణంలో ఎమర్జెన్సీ గ్రాస్ రిజర్వ్ (అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే గడ్డి)ను పెంచారు.
రీసైకిల్ చేసిన నీటిని దీని కోసం ఉపయోగించారు. వరల్డ్ కప్ మ్యాచ్లు, ప్రాక్టీస్ పిచ్ల కోసం నీటిని కృత్తిమ పద్ధతిలో తయారు చేస్తున్నారు. డీశాలినేషన్ ప్రక్రియ ద్వారా ఈ నీటిని తయారు చేస్తున్నారు.
ఖతార్ యూనివర్సిటీ హైడ్రాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ రాధౌయాన్ బిన్ హమాదౌ మాట్లాడుతూ ''సహజంగా లభించే నీటిపై ఆధారపడి ఉంటే, ఖతార్లో కేవలం 14,000 మంది మాత్రమే నివసించి ఉండేవారు. ఆ నీరు, ప్రపంచకప్ స్టేడియాలకు నాలుగింట ఒక వంతుకు కూడా సరిపోదు’’ అని అన్నారు.
ఖతార్లో ఒక్క నది కూడా లేదు. అక్కడ సంవత్సరానికి 10 సెం. మీ కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది.
- పని కోసం ఖతార్ వెళ్తే తిరిగి రావడం కష్టమా, పని మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి
- ఖతార్ సృష్టించిన 'ముత్యం’ లాంటి ఈ కృత్రిమ ద్వీపం ప్రత్యేకత ఏంటి? ప్రజలు ఇక్కడ ఉండటానికి ఎందుకు ఎగబడుతున్నారు?
పెరుగుతున్న సమస్య
ఖతార్లో దాదాపు 29 లక్షల మంది నివసిస్తున్నారు. ఖతార్ జనాభాకు అక్కడ లభ్యమయ్యే నీటి పరిమాణానికి మధ్య చాలా అంతరం ఉంది. తన అవసరాలను తీర్చుకోవడానికి తగిన నీటి కోసం ఖతార్ మరో ప్రత్యామ్నాయంపై ఆధారపడాల్సి ఉంటుంది.
''వాస్తవానికి ఈ నీటిలో ఎక్కువ భాగం డీశాలినేషన్ ద్వారా వస్తుంది. గృహ, వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించే నీరు 100 శాతం ఈ విధానం ద్వారా లభిస్తుంది’’ అని యూకే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్లోని ఫిషరీష్ అక్వాకల్చర్ సైన్స్ మిడిల్ ఈస్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ విల్ లే క్యూజోన్ చెప్పారు.
ఈ ప్రక్రియ ద్వారా సముద్రంలో ఉప్పునీటిని తీసుకొని దాన్నుంచి ఉప్పుతో పాటు ఇతర మలినాలను తొలగిస్తారు. దీంతో ఈ నీరు తాగడానికి, బట్టలు ఉతకడానికి అనుకూలంగా మారుతుంది.
ఖతార్ భారీ మొత్తంలో ఈ ప్రక్రియ ద్వారా నీటిని తయారు చేస్తుంది. అయితే, ఖతార్ అభివృద్ధి చెందుతోంది. వరల్డ్ కప్ వంటి మెగా క్రీడా ఈవెంట్ల నిర్వహణ కోసం ప్రణాళికలు రచిస్తున్నందున ఈ ప్రక్రియలో నీటి ఉత్పత్తిని మరింత వేగవంతం చేయాల్సి ఉంటుంది.
ప్రపంచకప్ సందర్భంగా దాదాపు పది లక్షల మంది పర్యాటకులు ఖతార్కు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి వినియోగం దాదాపు 10 శాతం పెరుగుతుందని అంచనా వేశారు.
ఖతార్లో సముద్రం కారణంగా నిరవధిక నీటి లభ్యత ఉంది. గ్యాస్, సహజ వనరులు, ఆర్థిక వనరులతో పాటు ఈ ప్రక్రియ ద్వారా నీటిని తయారు చేయడానికి అవసరమైన శక్తి వనరులు కూడా ఖతార్ వద్ద ఉన్నాయి. కానీ ఈ ప్రక్రియలో ఒక ప్రధాన లోపం ఉంది. ఇది చాలా ఎనర్జీని వినియోగిస్తుంది.
"మొత్తం గల్ఫ్ రీజియన్లో డీశాలినేషన్ కోసం ఉపయోగించే శక్తిలో 99.9 శాతం హైడ్రోకార్బన్ ఇంధనాల చౌక సరఫరా ద్వారా వస్తుంది’’ అని డాక్టర్ విల్ లే క్యూజోన్ చెప్పారు.
చమురు, గ్యాస్ వంటి హైడ్రోకార్బన్ ఇంధనాలు చాలా కాలుష్యాన్ని కలిగిస్తాయి. పర్యావరణానికి సంబంధించి ఖతార్ కొన్ని లక్ష్యాలను విధించుకుంది.
2030 నాటికి గ్రీన్హౌస్ ఉద్గారాలను 25% తగ్గించాలని ఖతార్ భావిస్తోంది. ఈ ప్రపంచకప్ను జీరో కార్బన్ ఎమిషన్ టోర్నీగా నిర్వహిస్తున్నామంటూ వరల్డ్ కప్ నిర్వాహక కమిటీ పేర్కొంది.
అయితే ''కార్బన్ మార్కెట్ వాచ్’’ వంటి పర్యావరణ గ్రూప్లు మాత్రం ఖతార్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి.
అయితే, ఒక్క విషయాన్ని మాత్రం తోసిపుచ్చలేం. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఖతార్ నిజంగానే కృషి చేస్తోంది. నీటి ఉత్పత్తి అంశాన్ని కూడా ఇందులో చేర్చారు.
- ఖతార్: అత్యంత సంపన్న దేశంలో పేదరికం ఎలా ఉంటుందంటే...
- ఫుట్బాల్ వర్సెస్ క్రికెట్: బ్రాండ్ వాల్యూలో కోహ్లి ఎక్కువా? పుట్బాలర్ మెస్సీ ఎక్కువా? కారణాలేంటి?
హరిత లక్ష్యాలు
''చాలా పని జరుగుతోంది. వారు డీశాలినేషన్ కోసం సౌరశక్తిని ఉపయోగించుకునే అంశంపై పనిచేస్తున్నారు. వారు సౌర ఫలకాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసి, దాన్ని రివర్స్ అస్మోసిస్ కోసం ఉపయోగించవచ్చు. లేదా సూర్యుని ప్రత్యక్ష వేడిని నీటిఆవిరి చేయడానికి వినియోగించవచ్చు’’ అని డాక్టర్ విల్ లే క్యూజోన్ అన్నారు.
రివర్స్ అస్మోసిస్ ప్రక్రియలో నీరు ఒక వాహకం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ ప్రక్రియలో నీటిలో మలినాలు సమర్థవంతంగా తొలిగిపోతాయి. స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వస్తుంది.
ఇటీవల ఏర్పడిన రాజకీయ వివాదం తర్వాత పొరుగు దేశాలు ఖతార్ను బహిష్కరించాయి. దీంతో ఆ దేశం ఆహారకొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది.
అప్పటి నుంచి ఖతార్ దేశీయంగా పాల ఉత్పత్తి, వ్యవసాయ సాగు పెంచడంపై కృషి చేస్తోంది. బీడు భూములను వ్యవసాయానికి వాడటం, జంతువుల పెంపకం పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు. అయితే, ఈ విధానాలు కూడా ఖతార్లోని పరిమిత నీటి వనరులపై ఒత్తిడిని పెంచుతాయి.
''నీటి వనరుల్లో మూడో వంతును వ్యవసాయంలో ఉపయోగించాలి. అయితే, ఖతార్ స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ పాత్ర 1 శాతం కంటే తక్కువే. ఇది 0.1 శాతమే’’ అని డాక్టర్ హమాదౌ అన్నారు.
ఆర్థిక లాభం కోసం కాకుండా అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రజలకు ఆహారం అందించాలనే ఉద్దేశంతోనే వ్యవసాయం వైపు మొగ్గుతోంది.
ఖతార్ ఎనర్జీ ప్రణాళికలు బయటి వారికి వింతగా అనిపించవచ్చు. ఖతార్ ఎదుర్కొంటున్న సవాళ్లు ఇతర దేశాలకు మరీ భిన్నంగా ఉండవని డాక్టర్ లే క్యూజోన్ చెప్పారు.
''ఎడారి దేశాల్లో నీరు అవసరం ఉంటుంది. శీతల దేశాల్లో వెచ్చదనం, వేడి అవసరం ఉంటుంది. దీన్నిబట్టి ప్రతీ దేశానికి సొంత సవాళ్లు ఉంటాయి’’ అని ఆయన అన్నారు.
ఖతార్ 2036లో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించాలని భావిస్తోందని, అలా జరిగితే ఖతార్కు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని ఊహాగానాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఫిఫా ప్రపంచకప్లో '33వ జట్టు' పాలస్తీనా.. ఆడకుండానే అభిమానుల మనసు గెలుచుకుంది
- డేటింగ్: బహుళ వ్యక్తులతో సంబంధాలు నడిపే 'సోలో పాలియమరి’లో మంచి, చెడులేమిటి?
- రైలు ప్రయాణం: ప్రయాణికులకు తగినన్ని రైళ్లు నడపటం లేదా? రిజర్వేషన్ బోగీలలో తరచూ తగాదాలెందుకు?
- మూడేళ్ల నుంచి ఈమె నోటితోనే ఎందుకు శ్వాస తీసుకుంటున్నారు
- మంచిర్యాల: ఆరుగురు సజీవ దహనం.. హత్యలా? ప్రమాదమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)