శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఆయనే: రెండో స్థానంలో: పారిపోయాడనుకుంటోన్న వేళ.. ప్రత్యక్షం
కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకొన్న శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నికయ్యారు. ఇవ్వాళ నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. రణిల్ విక్రమసింఘెకు 134 ఓట్లు పడ్డాయి. ఆయన సమీప ప్రత్యర్థి, శ్రీలంక పోడుజన పెరమున ఎంపీ దుల్లాస్ అలహప్పెరుమ రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 82 ఓట్లు పోల్ అయ్యాయి. వామపక్షాల తరఫున పోటీ చేసిన అనుర దిశనాయకె కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. దిశనాయకెకు మూడు ఓట్లు మాత్రమే దక్కాయి.
గొటబయ స్థానంలో..
దేశంలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించలేక దేశం విడిచి పారిపోయిన గొటబయ రాజపక్స స్థానంలో ఇక రణిల్ విక్రమసింఘె అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన నాయకత్వం వైపే మెజారిటీ శ్రీలంక పార్లమెంట్ సభ్యులు మొగ్గు చూపారు. నిజానికి- రణిల్ విక్రమసింఘె సారథ్యం పట్ల కూడా లంకేయుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. తాజాగా ఆయన గెలుపును వారు ఎలా స్వీకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఓటింగ్ ఇలా..
శ్రీలంక పార్లమెంట్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 225. ఇందులో 223 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఓటు వేశారు. 219 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదు. మరో ఇద్దరు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. మాజీ ప్రధానమంత్రి మహీంద రాజపక్స, ఆయన కుమారుడు నమల్ రాజపక్స కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మహీంద రాజపక్స ప్రత్యక్షం..
ఓటు వేయడానికి ఆయన తన కుమారుడితో కలిసి పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో మహీంద రాజపక్స సమీప బంధువులు.. చమల్ రాజపక్స, తిలక్ రాజపక్స, శశీంద్ర రాజపక్స, గుణతిలక రాజపక్స ఉన్నారు. వీరందరూ గొటబయ రాజపక్స, బాసిల్ రాజపక్సకు అత్యంత సమీప బంధువులు. నిజానికి- మహీంద రాజపక్స కూడా దేశం విడిచి పారిపోయాడంటూ వార్తలు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పార్లమెంట్ భవనంలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
లక్ష్యమదే..
రణిల్ విక్రమసింఘెకు ఇప్పటివరకు ఆరుసార్లు ప్రధానమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో తాను దేశాన్ని సంక్షోభ పరిస్థితుల నుంచి ఒడ్డెక్కిస్తానని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన మాట్లాడారు. తన ముందు అనేక కఠిన సవాళ్లు, సంక్షోభాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. వాటిని అధిగమించడమే తన ముందు ఉన్న లక్ష్యమని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సంక్షోభ పరిస్థితులను రూపుమాపడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.