బ్రెజిల్లో కరోనా మరణ మృదంగం... సైకో లీడర్ వల్లే ఈ గతి.. ఇకనైనా మేల్కొనాలని జనం గగ్గోలు...
బ్రెజిల్లో కరోనా మరణ మృదంగం మోగుతోంది. మంగళవారం(మార్చి 23) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3251 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక మరణాల రేటులో బ్రెజిల్ టాప్లో ఉంది. కేసుల సంఖ్యలో అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న బ్రెజిల్లో రోజురోజుకు పరిస్థితి దిగజారుతోంది. ఇప్పటికే ఆస్పత్రులన్నీ పేషెంట్లతో నిండిపోగా... ఇదే పరిస్థితి కొనసాగితే అక్కడి హెల్త్ కేర్ వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వల్లే దేశంలో ఇంత దారుణ పరిస్థితి నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

'సైకో లీడర్..' వల్లే ఇదంతా... : గవర్నర్ డొరియా
తాజాగా బ్రెజిల్లో కరోనా కారణంగా సంభవించిన మరణాల్లో 1,021 మరణాలు ఒక్క సావ్ పౌలో రాష్ట్రంలోనే సంభవించాయి. గతేడాది జులైలో ఇదే సావ్ పౌలో రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధికంగా 713 మంది ఒక్కరోజే మరణించారు. బ్రెజిల్లో పరిస్థితి ఇంతలా దిగజారడానికి దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారోనే కారణమని సావ్ పౌలో గవర్నర్ డొరియా ఆరోపించారు. బోల్సోనారో ఒక సైకో లీడర్ అని... కరోనా సంక్షోభాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని విమర్శించారు.

ఆరోగ్య శాఖ మంత్రి మళ్లీ మార్పు...
'ఒక బాధ్యతారాహిత్యమైన,సైకో లీడర్ను కలిగి ఉన్నందుకు బ్రెజిల్ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘట్టంలో ఈ దేశలు ప్రజలు సతమతమవుతున్నారు. దేశాధ్యక్షుడి నిర్లక్ష్యానికి సామాన్య పౌరులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. దేశంలో ఇద్దరు ఆరోగ్యశాఖ మంత్రులు ఉన్నారు... కానీ వాస్తవం మాట్లాడుకోవాలంటే వాళ్లు ఉన్నా లేనట్లే.' అని గవర్నర్ డొరియా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ బ్రెజిల్లో నలుగురు ఆరోగ్య శాఖ మంత్రులు మారారు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్ డాక్టర్ మార్సెలో క్యురోగాను ఆరోగ్య మంత్రిగా నియమించారు. అంతకుముందు ఆర్మీ జనరల్ ఎడ్వర్డో పజుఎల్లోను ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించగా... ఎలాంటి వైద్య అనుభవం లేని వ్యక్తిని ఆరోగ్యశాఖ మంత్రిగా ఎలా నియమిస్తారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మరోసారి ఆ శాఖ మంత్రిని మార్చక తప్పలేదు.

ఇప్పటికైనా మేల్కొనాలని...
బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో తొలి నుంచి కరోనా కట్టడిలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే ఆర్థిక కార్యకలాపాలే ముఖ్యమన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వందలాది మంది బ్రెజిలియన్ ఆర్థికవేత్తలు,మాజీ ఆర్థికమంత్రులు,సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు జైర్ బోల్సోనారోకి బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని... వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

బోల్సోనారో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే...
కరోనా విషయంలో జైర్ బోల్సోనారో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే... వ్యాక్సిన్ అందరికీ తప్పనిసరి అని సుప్రీం కోర్టు చెప్తే... తాను మాత్రం వ్యాక్సిన్ వేయించుకోనని అన్నారు. అంతేకాదు,వ్యాక్సిన్పై జనాల్లో లేనిపోని గందరగోళం సృష్టించారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మొసళ్లలా మారిపోతే తనది బాధ్యత కాదని... మహిళలకు గడ్డాలు,పురుషుల గొంతు మహిళల్లా మారిపోతే తానేమీ చేయలేనని అన్నారు. అంతేనా... మాస్కులు కూడా ధరించాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. అధ్యక్షుడు నిర్లక్ష్యంతో బ్రెజిల్లో వైరస్ మళ్లీ తిరగబెట్టింది. రోజురోజుకు కొత్త వేరియంట్స్ బయటపడుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి దేశం ఎలా గట్టెక్కుతుందోనని బ్రెజిల్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications