కాల్పులతో హింసాత్మకంగా మారిన నిరసనలు: శ్రీలంక అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి మృతి
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చేస్తున్న భారీ నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక నిరసనకారుల మధ్య చెదురుమదురు ఘర్షణలు చెలరేగడంతో శ్రీలంక అధికార పార్టీ ఎంపీ సోమవారం మరణించారు. ద్వీప దేశం అంతటా వ్యాపించిన ఘర్షణల్లో 130 మందికి పైగా గాయపడ్డారు.
శ్రీలంక అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి అతుకోరాల మరణాన్ని పోలీసు అధికారులు కూడా ధృవీకరించారు. ఏఎఫ్పీ నివేదిక ప్రకారం.. కొలంబో-కాండీ హైవేలో ఉన్న నిట్టంబువా పట్టణంలో నిరసనకారులపై ఎంపీ కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆ తర్వాత సమీపంలోని భవనంలో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించిన ఎంపీ అనుమానాస్పాద స్థితిలో మరణించారని అధికారులు వెల్లడించారు. ఇటీవల చెలరేగిన శ్రీలంక ఘర్షణల్లో ఇద్దరు మరణించారని, 139 మంది గాయపడ్డారని అధికారులు నివేదించారు.
శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స్ రాజీనామా
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి భారీ ఎత్తున నిరసనలను ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందే, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించారు పాలనాధికారులు.
శ్రీలంక రాజధాని కొలంబోలో సైన్యాన్ని రంగంలోకి దించారు. శ్రీలంకలో రోజురోజుకు పరిస్థితులు హింసాత్మకంగా మారుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు పోలీసులు. దేశ రాజధాని కొలంబోలో జరిగిన హింసాత్మక ఘటనలో దాదాపు 23 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కర్ఫ్యూ అమల్లోనే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో.. పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, అధికార నేతల రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష భవనం ఎదుట కూడా భారీ ఎత్తున నిరసనకారులు ఆందోళనలు చేపడుతున్నారు. మహింద రాజపక్స రాజీనామాతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కూడా ఏర్పడినట్లయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు రావడం లేదు. తప్పులన్నీ చేసి ఇప్పుడు తమకు అధికారం అప్పగిస్తారా? అంటూ నిలదీస్తున్నాయి.