ట్రంప్కు పుతిన్ షాక్: రష్యా నుండి 155 మంది దౌత్యాధికారులు వెనక్కి
అమెరికా, రష్యా మధ్య ప్రచ్చన్నయుధ్ధం జరుగుతున్నట్లు కన్పిస్తోంది. రష్యా దౌత్య కార్యాలయాలను అమెరికా బలవంతంగా ఖాళీ చేసింది.
షామెన్:అమెరికా, రష్యా మధ్య ప్రచ్చన్నయుధ్ధం జరుగుతున్నట్లు కన్పిస్తోంది. రష్యా దౌత్య కార్యాలయాలను అమెరికా బలవంతంగా ఖాళీ చేసింది. దీంతో ఈ చర్యకు ప్రతిచర్యగా రష్యా నుంచి అమెరికా దౌత్యవేత్తలను వెనక్కి పంపించే యోచనలో ఉన్నారు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్.
ఇప్పటికే రష్యాలో అమెరికా దౌత్యాధికారుల సంఖ్యను 455 మందికి తగ్గించారు పుతిన్.అయితే ఈ సంఖ్యను మరింతగా తగ్గించాలని పుతిన్ భావిస్తున్నారు. తాజాగా మరో 155 మందిని వెనక్కి పంపిస్తానని హెచ్చరించారు.

'రష్యాలో ఎంతమంది అమెరికా దౌత్యాధికారులు ఉండాలో నిర్ణయించే అధికారం మాకుంది. అయితే ఇప్పట్లో మేం ఆ నిర్ణయం తీసుకోం. ప్రస్తుతం రష్యాలో 455 మంది అమెరికా దౌత్యాధికారులు ఉన్నారు. అమెరికాలో కూడా అంతేమంది రష్యా దౌత్యాధికారులు పనిచేస్తున్నారు.
కానీ అందులో 155 మంది ఐరాసకు రష్యా దౌత్య అధికారులుగా వ్యవహరిస్తున్నారు. అంటే 300 మందే కాన్సులేట్స్లో పనిచేస్తున్నట్లు. అందుకే రష్యాలోని అమెరికా దౌత్యాధికారుల సంఖ్య కూడా 300 మాత్రమే ఉండాలి. అంటే మరో 155 మందిని వెనక్కి పంపొచ్చు' అని పుతిన్ అన్నారు.
ఆ మధ్య రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ఓ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా.. తమ దేశంలోని అమెరికా దౌత్యాధికారులను 455కు తగ్గించుకోవాలని ఆదేశించింది. సెప్టెంబర్ 1 వరకూ ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించింది.
ఇదిలా ఉండగా.. గత శనివారం శాన్ఫ్రాన్సిస్కోలోని రష్యా కాన్సులేట్ను, న్యూయార్క్, వాషింగ్టన్లలోని దౌత్య భవనాలను అమెరికా బలవంతంగా ఖాళీ చేయించింది. దీంతో మరోసారి ఈ రెండు దేశాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి.












Click it and Unblock the Notifications