అమెరికా-రష్యా మధ్య యుద్దం జరగొచ్చు: మాజీ ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
నాటో దళాలను బలహీనపరిచేందుకు పుతిన్ కుట్ర పన్నుతున్నారని, ఇప్పటికే సిరియా, ఇరాన్ లలో రష్యా తిష్ట వేసిందని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చినే సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్దం తర్వాత అత్యంత భయానక యుద్దం అమెరికా-రష్యా మధ్య సంభవించవచ్చునని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాపై రష్యా చేసే ఈ దాడిలో విమానాలు, బాక్స్ కట్టర్ ల కన్నా శక్తివంతమైన సామాగ్రిని ఉపయోగిస్తారని ఆయన భావిస్తున్నట్లు చెప్పారు.
కాగా, బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డిక్ చినే ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తాజా సమ్మిట్ లో ఆయన ప్రపంచీకరణ నేపథ్యం.. జాతీయ భద్రతకు ఉన్న ముప్పుపై ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉందంటూ వస్తున్న కథనాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా అమెరికాకు పెద్ద ముప్పుగా పరిణమించిందని అభిప్రాయపడ్డారు.

నాటో దళాలను బలహీనపరిచేందుకు పుతిన్ కుట్ర పన్నుతున్నారని, ఇప్పటికే సిరియా, ఇరాన్ లలో రష్యా తిష్ట వేసిందని ఆయన అన్నారు. సైబర్ వార్ ద్వారా అమెరికన్ ఎన్నికలను ప్రభావితం చేయాలనుకుంటున్న పుతిన్ చర్య యుద్దానికి రెచ్చగొట్టడం లాంటిదేనని డిక్ చినే చెప్పుకొచ్చారు. ఒబామా సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం అణుపరీక్షలకు తక్కువ నిధులు కేటాయించడంతో భద్రత విషయంలో అమెరికా బలహీనంగా తయారైందని, ఇదే సమయంలో అమెరికా వ్యతిరేక శక్తులు తమ బలాన్ని పెంచుకున్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications