Russia-Ukraine Crisis:ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు-హంగరీ, రొమేనియా మీదుగా
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర భారతీయులకు చిక్కులు తెచ్చి పెడుతోంది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయుల్ని వెనక్కి తీసుకురావడం ఇప్పుడు కేంద్రానికి సవాలుగా మారింది. దీంతో ఇప్పుడు వారిని రక్షించేందుకు కేంద్రం విదేశాంగశాఖ సాయంతో దౌత్యాధికారుల్ని రంగంలోకి దింపింది. వారి సూచనల ఆధారంగా ఇప్పుడు ఉక్రెయిన్ లో భారతీయులు క్షేమంగా బయటపడేందుకు సాయం చేస్తోంది.
ఉక్రెయిన్ లో చిక్కుతున్న భారతీయులు ఎట్టి పరిస్దితుల్లోనూ రాజధాని కీవ్ వైపు రావొద్దని ఇప్పటికే భారతీయ ఎంబసీ కోరింది. అలాగే ఎక్కడి వారు అక్కడే ఉండాలని తెలిపంది. దీంతో పాటు భూగర్భ బంకర్లు, మెట్రో స్టేషన్లలో దాక్కోవాలని కూడా సూచించింది. వీటికి కొనసాగింపుగా ఇవాళ మరికొన్ని సూచనలు చేసింది. ఇందులో ఉక్రెయిన్ లో ప్రయాణాలు చేసే భారతీయులు తమ వాహనాలకు భారత మువ్వన్నెల జెండాను తప్పనిసరిగా పెట్టుకోవాలని కోరింది. అలాగే హంగరీ సరిహద్దులకు చేరుకోవాలని కూడా సూచించింది.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల్ని ప్రస్తుతం హంగరీ, రొమేనియా మీదుగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రష్యా బలగాలకు భారతీయ జెండా ఉన్న వాహనాలకు ముప్పు తలపెట్టకుండా రష్యా ప్రభుత్వం నుంచి సూచనలు పంపినట్లు తెలుస్తోంది. అలాగే హంగరీ, రొమేనియా సరిహద్దులకు చేరుకునే భారతీయులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని కూడా కోరుతోంది. దీంతో వీలైనంత ఎక్కువ మంది భారతీయుల్ని ఉక్రెయిన్ నుంచి స్వదేశాలకు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.