ట్రంప్పై సద్దాం హుస్సేన్ కూతురు కామెంట్స్: 'ఆ వీడియో ఎప్పటికీ చూడను!'
ట్రంప్ కు రాజకీయాలకు కొత్తయినా.. అతనిలో రాజకీయ సున్నితత్వం ఉందని ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ కూతురు రగద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.
జోర్డాన్ : ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ కూతురు రగద్ హుస్సేన్ అమెరికా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎన్ఎన్ ఛానల్తో ఫోన్ ఇంటర్వ్యూ సందర్భంగా ట్రంప్ పేరును ప్రస్తావించారు రగద్.
ట్రంప్ కు రాజకీయాలకు కొత్తయినా.. అతనిలో రాజకీయ సున్నితత్వం ఉందని ఈ సందర్బంగా రగద్ అభిప్రాయపడ్డారు.గతంలో అమెరికాను పాలించిన నేతల కన్నా, ట్రంప్ భిన్నంగా ఉన్నట్లు రగద్ హుస్సేన్ పేర్కొనడం గమనార్హం. ఇరాక్ తో యుద్దం విషయంలో గత ప్రభుత్వాల తీరును ట్రంప్ తప్పుబట్టారని, దీన్నిబట్టి చూస్తే.. ఇరాక్ యుద్దం వల్ల అమెరికా చేసిన పొరపాటును ట్రంప్ గ్రహించారని రగద్ తెలిపారు.
తన తండ్రి సద్ధాం హుస్సేన్కు ఎలా అన్యాయం జరిగిందన్న విషయం కూడా ట్రంప్ కు తెలుసునని రగద్ చెప్పారు. కాగా, 1979 నుంచి 2003 వరకు ఇరాక్ను సద్ధాం పాలించిన సంగతి తెలిసిందే. సద్దాం పాలనలో షియాలు భారీ ఊచకోతకు గురయ్యారు. ఇదే సమయంలో అణ్వాయుధాలున్న నెపంతో అమెరికా సేనలు ఇరాక్లో భారీ విధ్వంసం సృష్టించాయి.
యుద్ద నేరాల కింద సద్దాంను అరెస్టు చేసిన అమెరికా.. 2006లో ఉరితీసింది. దాన్ని ఇరాకీ టీవీ లైవ్ ప్రసారం చేయగా.. తన తండ్రి ఉరితీత వీడియోను తానెప్పటికీ చూడబోనని రగద్ తెలిపారు.