సౌదీలో వివాహేతర సంబంధం: రాళ్లతో కొట్టి చంపండంటూ తీర్పు
న్యూఢిల్లీ: శ్రీలంక నుంచి సౌదీ అరేబియా రాజధాని రియాద్కు వెళ్లి అక్కడ ఒక ఇంట్లో పనిమనిషిగా పని చేస్తున్న ఓ మహిళకు స్థానిక కోర్టులో దారణమైన శిక్ష పడింది. ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు గాను ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని కోర్టు తీర్పు వెలువరించింది.
వివరాల్లోకి వెళితే, శ్రీలంకకు చెందిన 45 ఏళ్ల మహిళ 2013 నుంచి రియాద్లో ఇక ఇంట్లో పనిమనిషిగా పని చేస్తోంది. శ్రీలంక నుంచి సౌదీ అరేబియాకు వచ్చిన ఒక వ్యక్తితో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది.
దీంతో అతడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు గాను వీరిద్దరినీ దోషులుగా నిర్ధారించినట్లు గత ఆగస్టులో కోర్టు ప్రకటించింది. కట్టుకున్న భర్తను మోసం చేసి వేరే అతడితో సంబంధం పెట్టుకున్నందుకు గాను ఆ మహిళను రాళ్లతో కొట్టి చంపాలని కోర్టు తీర్పునిచ్చింది.
అయితే పెళ్లైన మహిళతో సంబంధం పెట్టుకున్న ఆమె ప్రియుడికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి 100 కొరడా దెబ్బల శిక్షను మాత్రం విధించింది. దీంతో సమాచారం అందుకున్న శ్రీలంక ఎంబసీ అధికారులు ఈ కేసు విషయమై పై కోర్టులో అప్పీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
అంతేకాదు తప్పు చేసిన ఆ మహిళకు ప్రాణభిక్ష కోసం దౌత్య మార్గాల ద్వారా కూడా ప్రయత్నం చేస్తామన్నామని తెలిపారు. సౌదీ అరేబియాలో వ్యభిచారం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మంత్రవిద్య లాంటి వాటిని నేరంగా పరిగణిస్తారు.