అన్నంత పనీ చేసిన ట్రంప్-భారత్ కు బయలుదేరిన తొలి ఫ్లైట్..!
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని చెప్పి మరీ గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అన్నంత పనీ చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ వంటి మిత్రదేశాలూ ఇందుకు మినహాయింపు కాదని ట్రంప్ తేల్చేస్తున్నారు.
ఇప్పటికే వివిధ దేశాలకు అక్రమ వలసల్ని ప్రత్యేక విమానాల్లో పంపేస్తున్న ట్రంప్.. ఇప్పుడు భారతీయుల వరకూ వచ్చేశారు. తాజాగా అమెరికా నుంచి తొలి అక్రమ వలసల విమానం భారత్ కు బయలుదేరింది.

అమెరికాలో దశాబ్దాలుగా పాగా వేసిన అక్రమ వలసదారుల్ని బహిష్కరించేందుకు ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇందులో ఏమాత్రం కనికరం చూపించడం లేదు. వేగంగా అక్రమ వలసలను గుర్తిస్తూ వారిని విడతల వారీగా స్వదేశాలకు పంపేస్తున్నారు. ఆయా దేశాలకు ముందుగానే వీరి సమాచారం పంపేస్తున్నారు. ఒక వేళ ఇలా తమ వలసదారుల్ని స్వీకరించేందుకు ముందుకు రాని దేశాలు ఉంటే వాటిపై ఆంక్షల కొరడా ఝళిపిస్తున్నారు. దీంతో ఆయా దేశాలు కిక్కురుమనకుండా వలసల్ని ఆహ్వానిస్తున్నాయి.
ఇదే క్రమంలో పలువురు భారతీయ అక్రమ వలసదారుల్ని గుర్తించిన ట్రంప్ సర్కార్ వీరిని తాజాగా ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపేసింది. అయితే ఎంత మందిని ఇలా తరలించాలో పూర్తి వివరాలు తెలియడానికి మరికొద్ది గంటలు పట్టే అవకాశం ఉంది. అమెరికా నుంచి అయితే భారతీయ అక్రమ వలసదారుల విమానం బయలుదేరినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నిర్ధారించింది. వీరిని అమెరికాకు చెందిన సీ17 విమానంలో తరలిస్తున్నారని పేర్కొంది. వీరు భారత్ కు చేరుకునేందుకు కనీసం 24 గంటలు పడుతుందని తెలిపింది. కాబట్టి ఆ విమానం భారత్ కు వస్తే కానీ ఎంత మందిని ఇలా పంపేశారో తెలిసే పరిస్ధితి లేదు. ఈ వ్యవహారంపై కేంద్రం కూడా నోరుమెదపడం లేదు.
వాస్తవానికి అమెరికాలో భారతీయ వలసదారులు 7.25 లక్షల మంది ఉన్నారు. అయితే ఇందులో 18 వేల మందిని అక్రమ వలసదారులుగా గుర్తించారు. వీరిని స్వదేశానికి పంపేందుకు మోడీ సర్కార్ తో ట్రంప్ మాట్లాడారు. దీనికి భారత్ కూడా అంగీకరించడంతో ఈ 18 వేల మందిని విడతల వారీగా పంపుతున్నారు. ఈ బహిష్కరణలు పూర్తయ్యే లోపు వైట్ హౌస్ కు వెళ్లి ట్రంప్ తో భేటీ అయ్యేందుకు భారత ప్రధాని మోడీ సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications