పాకిస్థాన్ ప్రధానిని డిన్నర్ కు ఆహ్వానించిన ట్రంప్.. భారత్ రియాక్షన్ ఇదే..!
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్ లో భాగంగా సెప్టెంబర్ 23 న ఇరు దేశాల అధినేతల మధ్య సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 23 సాయంత్రం ట్రంప్ తో పాటు అమెరికా ఫస్ట్ లేడీ, ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ రిసెప్షన్ డిన్నర్ ను ఏర్పాటు చేయనున్నారు. యూనైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న దేశాధినేతలు మేడిసన్ అవెన్యూలోని లొట్టే న్యూయార్క్ ప్యాలెస్ లో ఏర్పాటు చేయనున్న విందులో పాల్గొననున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 13 ఆదివారం రోజున పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఆహ్వానం అందింది. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు కానున్న ఈ డిన్నర్ కు రావాలంటూ అమెరికా నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం అందుతోంది.
ఈ డిన్నర్ సమావేశంలో భాగంగా షెహబాజ్ షరీఫ్.. ఇతర దేశాల అధినేతలతోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్ లో ట్రంప్- షెహబాజ్ ముఖాముఖిగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ఫేస్ టూ ఫేస్ సమావేశం కానున్నారు. ఇక 2025 సెప్టెంబర్ లోనూ ఇరు దేశాధినేతలు అమెరికా అధ్యక్ష భవనం అయిన వైట్ హౌజ్ లో భేటీ అయ్యారు. ఆ తర్వాత అక్టోబర్ లో ఈజిప్ట్ లో జరిగిన షర్మ్- ఎల్- షేక్ శాంతి సదస్సులోనూ కలిశారు.
సెప్టెంబర్ 23 డిన్నర్ అనంతరం షెహబాజ్ షరీఫ్ న్యూయార్క్ లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 25 న యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో భారత్.. సింధు జలాల నిలిపివేత అంశంపై ఆయన మాట్లాడనున్నట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అలాగే ఆగస్టు 7 పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య కుదిరిన మక్కా ఒప్పందంపైనా ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

ఇక గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దాంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడమే కాకుండా సింధు జలాల పంపిణీని నిలిపివేసింది. ఇక 81 వ యూనైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు జరగనున్నాయి. యూఎన్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఈ సమావేశాలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications
