ఢిల్లీ సరిహద్దుల్లోని ఎయిర్ బేస్ లో షేక్ హసీనా ల్యాండింగ్ ! రాత్రికి ఇక్కడే బస-తర్వాత లండన్ కు..
అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ ను వీడి ఇవాళ పారిపోయిన ప్రధాని షేక్ హసీనా ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న ఘజియాబాద్ హిండన్ ఎయిర్ బేస్ లో ఆమె విమానం ల్యాండ్ అయింది. ఆర్మీ డెడ్ లైన్ మేరకు ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుంచి ఆర్మీ హెలికాఫ్టర్ లో వెళ్లిపోయిన హసీనా.. అనంతరం పలు చోట్లకు తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ఆమె రాత్రికి అక్కడే బసచేసి అనంతరం లండన్ కు బయలుదేరి వెళ్లనున్నారు.
ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ కు చేరుకున్న హసీనాను ఎయిర్ ఫోర్స్ అధికారులు రిసీవ్ చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఆమె రాత్రికి ఢిల్లీలో ఉండి అనంతరం లండన్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హసీనాకు ముప్పు వాటిల్లకుండా కేంద్రం అదనపు భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. కేంద్రం సాయంతోనే హసీనా భారత్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

మరోవైపు బంగ్లాదేశ్ తో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. 2217 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్ తో సరిహద్దు ఉన్న పశ్చిమ బెంగాల్ లో ప్రజలు పొరుగుదేశంలో పరిణామాల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండాలని ప్రజలను కోరారు. మరోవైపు బంగ్లాదేశ్ లో ఎలాంటి ఎమర్జెన్సీ విధించడం లేదని అక్కడి సైన్యం ప్రకటించింది. కానీ ఢాకా ఎయిర్ పోర్టు నుంచి మాత్రం విమానాల రాకపోకల్ని నిలిపివేశారు.












Click it and Unblock the Notifications