Sheikh Hasina: బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా-భారత్ కు నష్టమేనా ?
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లపై చెలరేగిన అలర్లు తారాస్దాయికి చేరడంతో ఇవాళ ప్రధాని షేక్ హసీనా తన పదవి నుంచి తప్పుకున్నారు. అంతే కాదు అధికారిక నివాసం వీడి విదేశాలకు పారిపోయారు. హసీనా రాజీనామాకు డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో సాగుతున్న ఆందోళనలు ఇవాళ ఆమె అధికారిక నివాసానికి వ్యాపించాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి హెలికాఫ్టర్ లో పారిపోయారు. అయితే ఈ పరిణామాలు భారత్ కు ప్రతికూలం కానున్నాయి.
భారత్ కు సన్నిహిత మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ కు సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన షేక్ హసీనా ఇవాళ తప్పుకోవడం మనకు నష్టదాయకంగా మారనుంది. ఎందుకంటే భారత్ కు తూర్పున ఉన్న బంగ్లాదేశ్ లో ఇప్పటికే పరిస్ధితులు శృతిమించుతున్నాయి. అక్కడి నుంచి భారత్ కు తీవ్రవాదులు చాలా సులువుగా చొరబడుతున్నారు. వీరిని అదుపు చేసేందుకు హసీనా సర్కార్ ప్రయత్నిస్తూనే ఉంది. అంతలోపే ఆమెకు స్వదేశంలో ఇబ్బందికర పరిస్ధితులు ఎదురుకావడంతో పదవి నుంచి తప్పుకున్నారు.

భారత్ కు అనుకూల నేతగా పేరున్న షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ స్ధానంలో ఆమె ప్రత్యర్థులు లేదా ఆర్మీ గద్దెనెక్కడం ఖాయం. అదే జరిగితే భారత్ తో ఇప్పటివరకూ ఉన్న సన్నిహిత సంబంధాలు కొనసాగే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే భారత్ తో ఇప్పటివరకూ ఆమె నెరుపుతున్న సంబంధాలకు బ్రేక్ పడటం ఖాయం. అలాగే ఇరుదేశాల మధ్య మైత్రికి ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో షేక్ హసీనా రాజీనామాపై భారత్ ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications