ఆఫ్ఘనిస్థాన్లో షరియా చట్టం మాత్రమే ; ప్రజాస్వామ్యం ఉండదు : తాలిబన్ల సంచలనం, మళ్ళీ ఆటవిక పాలన మొదలు !!
ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్లు వశం చేసుకున్నప్పటినుండి ఆఫ్ఘనిస్థాన్ వాసులలో, అలాగే ప్రపంచ దేశాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ని వశం చేసుకుని అధికారం చేపట్టడంతో ఆఫ్ఘనిస్థాన్ దేశంలో ప్రస్తుతం సంక్షోభం నెలకొంది. తాలిబన్ల నిరంకుశ పాలన, ఆటవిక విధానాలు మళ్లీ మొదలవుతాయని ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తమౌతుంది. తాలిబన్లు నిరంకుశ షరియా చట్టాన్ని అమలు చేస్తారని ఆఫ్ఘనిస్తాన్ వాసులు భయపడుతున్న పరిస్థితులున్నాయి.
తాలిబన్ల ఆటవిక పాలనపై ఆఫ్ఘన్ లకు భయం
అయితే మొదటి అలాంటిదేమీ లేదని, ఎవరికీ ఎలాంటి హాని కలిగించమని చెప్పిన తాలిబన్లు తమ నిజస్వరూపాన్ని చూపిస్తారని భయపడుతున్నారు. ఇప్పటికే తాలిబన్ల పాలనపై ఆఫ్ఘనిస్థాన్లో పెద్దఎత్తున వ్యతిరేకత చెలరేగుతుంది. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ప్రజల ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీసిన దృశ్యాలు తాలిబన్ల ఆటవిక పాలనకు అద్దం పడుతున్నాయి. విమానాలు వెంట పరిగెత్తడం గాల్లోకి ఎగిరిన విమానాలను సైతం పట్టుకొని దేశం దాటాలని ప్రయత్నాలు చేయడం తాలిబన్లు అంటే ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకున్న భయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలనపై నిరసన
ఇప్పటికే తాలిబన్ల పాలనపై మహిళలు తమ నిరసనను తెలియ చేసిన విషయం తెలిసిందే. తాలిబన్లను ధిక్కరించిన ఆఫ్ఘనిస్థాన్ గవర్నర్ ను తాలిబన్లు అరెస్ట్ చేశారు. తాలిబన్లను ప్రతిఘటించిన ఆఫ్ఘనిస్థాన్ మొదటి మేయర్ చేసిన వ్యాఖ్యలు సైతం తాలిబన్ల పాలనను అర్థమయ్యేలా చెప్తున్నాయి. ఇక ఇదే సమయంలో తాలిబన్ సీనియర్ నాయకుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ఒక కౌన్సిల్ ను ఏర్పాటు చేసి దానిద్వారా ఆఫ్ఘనిస్థాన్ ను పాలిస్తారని, ఇస్లామిక్ గ్రూప్ యొక్క అత్యున్నత నాయకుడు హైబతుల్లా అఖుంజాదా అందుకు సంబంధించిన మొత్తం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అని తాలిబన్ సీనియర్ నాయకుడు వెల్లడించారు.
ఆఫ్ఘనిస్థాన్ లో షరియా చట్టం ప్రకారమే అంతా అంటున్న తాలిబన్లు
ఇదే సమయంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను ఎలా నడిపిస్తారు అనే విషయంలో ఇంకా అనేక అంశాలు ఖరారు చేయబడలేదని, గ్రూప్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదని తాలిబన్ నాయకుడు వహీదుల్లా హషిమి చెప్పారు. కానీ ఆఫ్ఘనిస్థాన్ ప్రజాస్వామ్య దేశం కాదని ఆయన వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్ లో మనం ఎలాంటి రాజకీయ వ్యవస్థను వర్తింపజేయాలి అనే దాని గురించి చర్చించడానికి ఏమీలేదని, ఇది షరియా చట్టం ప్రకారం నడవాల్సిందే నని ఆయన తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆఫ్ఘనిస్థాన్ లో చోటు లేదన్న తాలిబన్ నాయకుడు
ప్రజాస్వామ్య వ్యవస్థ అస్సలు ఉండదని వెల్లడించిన వహీదుల్లా హషిమి, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆఫ్ఘనిస్థాన్లో ఎలాంటి ఆధారం లేదన్నారు. హషిమి ఈ వారం చివర్లో పాలనా సమస్యలపై చర్చించే తాలిబన్ నాయకత్వ సమావేశంలో తాను చేరబోతున్నట్లు చెప్పారు. హషిమి చెప్పిన పవర్ స్ట్రక్చర్ 1996 నుండి 2001 వరకు తాలిబన్లు చివరిసారిగా అధికారంలో ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్థాన్ ఎలా నడిచింది అనేదానికి సారూప్యతను కలిగి ఉంది. హషిమి చేసిన వ్యాఖ్యలతో రెండు దశాబ్దాల క్రితం ఆఫ్ఘనిస్థాన్ దేశం ఎలాంటి రక్తపాతాన్ని చూసిందో మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తున్నాయని అర్థమవుతుంది.
గతంలోనూ తాలిబన్లు చెప్పిందొకటి, చేసింది ఆటవిక పాలన
గతంలో కూడా మొదట శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పిన తాలిబన్లు, నేరాలు, అవినీతి అరికడతామని చెప్పిన తాలిబన్లు పరిపాలనలోకి వచ్చిన తరువాత తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. నిరంకుశ పాలనకు శ్రీకారం చుట్టారు. ఇస్లామిక్ పాలన పేరిట షరియా చట్టాన్ని అమలు చేశారు. ఆటవిక చట్టాలను తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.హంతకులను, వివాహేతర సంబంధాలను కు పాల్పడిన స్త్రీ, పురుషులను బహిరంగంగా తలలు నరికి శిక్షించారు. దొంగతనాలకు పాల్పడిన వారిని చేతులు నరికి నరకయాతన చూపించారు.
షరియా పేరుతో కఠిన చర్యలు .. బాలికలు , మహిళలపై నిరంకుశత్వం
మహిళలు బుర్ఖాలు ధరించాలని, పురుషులు గడ్డాలు పెంచాలని హుకుం జారీ చేశారు.10 ఏళ్లు దాటిన బాలికలు చదువుకోవడానికి వీల్లేదని బాలికల విద్య పై ఆంక్షలు విధించారు. పరమత సహనం లేకుండా, ఇతర మతస్తుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. సంగీతం, టీవీ, సినిమాల వంటి వినోద కార్యక్రమాలపై నిషేధం విధించారు. ఒకపక్క ప్రజలకు ఎవరికీ ఎలాంటి హాని కలిగించమని చెబుతూనే, మరోపక్క ప్రజాస్వామ్య దేశం కాదని, షరియా చట్టం అమల్లో ఉంటుందని వెల్లడించడం తాలిబన్ల పాలనను అందరికీ అర్థమయ్యేలా చెబుతోంది. వారిలో మార్పు రాదనీ, వారు గతంలోలానే పాలన సాగిస్తారని స్పష్టంగా తెలుస్తుంది.
ఆఫ్ఘన్ సైనిక దళాలపైన తాలిబన్ నాయకుడి ఆసక్తికర వ్యాఖ్యలు
తాలిబన్లు మాజీ పైలట్లు మరియు ఆఫ్ఘన్ సాయుధ దళాలకు చెందిన సైనికులు కూడా తమ ర్యాంకుల్లో చేరతారని హషిమి చెప్పారు. తొలగించబడిన ఆఫ్ఘన్ ప్రభుత్వం కోసం పోరాడిన సైనికులు మరియు పైలట్లను నియమించడంపై, మిస్టర్ హషిమి మాట్లాడుతూ, తాలిబన్లు తమ స్వంత సభ్యులు మరియు చేరడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ సైనికులను తమ సైన్యంలోకి ఆహ్వానించి, కొత్త జాతీయ దళాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారని చెప్పారు.వారిలో చాలామంది టర్కీ మరియు జర్మనీ మరియు ఇంగ్లాండ్లో శిక్షణ పొందారు. కాబట్టి వారిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ సైన్యంలో చేరడానికి తాము వారితో మాట్లాడుతామని వెల్లడించారు. గత 20 సంవత్సరాలుగా వేలాదిమంది యు ఎస్ ఎన్ సేనలకు సహకరించిన ఆఫ్ఘనిస్తాన్ సైనికులను సైతం తాలిబన్లు హతమార్చారు. ఇక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో సైన్యంలో ఉన్న వారితో చర్చలు జరిపి ఆఫ్ఘనిస్తాన్ జాతీయ దళంలోకి ఆహ్వానిస్తామని చెప్తున్నారు.